‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు’ విలక్షణ నటుడు ‘ప్రకాశ్ రాజ్’ మనసులోని మాట ఇది. ఎప్పుడో సెప్టెంబర్ నెలలో జరగనున్న ఎన్నికల కోసం పోటీ చేయనున్న తన ప్యానల్ ని ముందుగానే ప్రకటించడం వెనుక ఉన్న అంశాల గురించి, ఆలోచనల గురించి ప్రకాష్ రాజ్ ఈ రోజు ఉదయం మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘గత నాలుగైదు రోజుల నుంచి మీడియాలో వస్తోన్న పుకార్లు చూసి కొంచెం భయపడ్డాము. కారణం ‘మా’ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమవుతున్నారంటూ కొన్నిచోట్ల వార్తలు వచ్చినందుకు వల్లే. నిజానికి ‘మా’లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. రెండేళ్ల నుంచే నేను ఆలోచిస్తున్నాను.
అయితే, గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానల్ లో ఎవర్నీ తీసుకోవాలి ? చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? లాంటి విషయాల పై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. మాది సినిమా బిడ్డల ప్యానల్. క్లారిటీగా చెబుతున్నాను. పదవీ కోసం మేము పోటీ చేయడం లేదు. పనిచేయడం కోసం పోటీచేస్తున్నాం. నా ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్లే. ఆఖరికి నేను తప్పు చేస్తే నన్ను కూడా వాళ్లు ప్రశ్నిస్తారు. ఆ అర్హత వాళ్లకు ఉంటుంది, ఉండాలి.
మోహన్ బాబు, చిరంజీవి, నాగార్జున ఇలా ప్రతిఒక్కరిదీ ఒక్కటే తపన, అసోసియేషన్ ని అభివృద్ధి చేయడమే. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లోకల్, నాన్ లోకల్ అనే మాటలను వింటున్నాను. కళాకారులు లోకల్ కాదు యూనివర్సల్. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో నాన్ లోకల్ అనే అంశం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇదేం అజెండా. నా అసిస్టెంట్స్కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు.
తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్ లోకల్ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్లోకల్ అంటున్నారు. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వమే అవుతుంది. ‘మా’ ఎంతో బలమైన అసోసియేషన్. మళ్ళీ చెబుతున్నాను. ఇది కోపంతో పుట్టిన ప్యానల్ కాదు. ఆవేదనతో పుట్టిన ప్యానల్. ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే, అలాగే ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే. నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటు వేయండి. మంచి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా మేము పనిచేస్తాం. ఈ మేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. ఎలక్షన్ డేట్ ప్రకటించే వరకూ మా ప్యానల్ లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు’ అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు.