Pawan, Mahesh, Prabhas : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెండి తెరమీద కనిపిస్తే.. అభిమానులకు పూనకాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. రెబల్ స్టార్ ప్రభాస్ గర్జనకు బాక్సాఫీస్ షేకైపోవాల్సిందే. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్నారు ఈ ముగ్గురు. మరి, ఇవాళ ఈ స్థాయికి చేరిన వీరికి నటన నేర్పింది ఎవరో తెలుసా? వీరిలోని నటుడిని సానబట్టి.. ఇండస్ట్రీకి తొలింది ఎవరో తెలుసా??
పై ముగ్గురు అగ్రనటులకే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలోని దాదాపు 80 మంది నటులకు పాఠాలు చెప్పాడు ఓ గురువు. ఆయన పేరు లంకా సత్యానంద్. నాటకాల మీద మక్కువతో చిన్న నాటి నుంచే నాటకరంగంలో కొనసాగిన సత్యానంద్.. ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు యాక్టింగ్ స్కూల్ ప్రారంభించి, ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. అగ్ర నటులకు ఆది గురువుగా ఉన్నారు.
చిన్న తనంలోనే రంగస్థలం మీదకు వచ్చిన సత్యానంద్.. ‘నాటుగిళ్ల చావిడి’ నాటకంలో బాల నటుడిగా ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి వందలాది నాటకాలు వేశారు. యుగ సంధ్య నాటికలో.. ఆయన వేసిన రాముడు పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన నాటకరంగాన్నే జీవితంగా మలుచుకున్నారు. ఈ క్రమంలో.. 1979లో ‘కళాజ్యోత్స్న’ అనే సంస్థను స్థాపించి తెలుగునాట నాటకాలు వేస్తూ వచ్చారు.
సత్యానంద్ ఎన్నో నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు. మనీ+షీ, మంచం మీద మనిషి, మనిషి నూతిలో పడ్డాడు, గారడి, నాగులు తిరిగే కోనలో, మానవతా నీవెక్కడ? దర్పణం.. వంటి ఎన్నో నాటకాలను డైరెక్ట్ చేశారు. ‘‘భారతరత్న ఇందిరమ్మ’’ పేరుతో ఆయన దర్శకత్వం వహించిన నాటాకాన్ని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ఒక రోజు వీక్షించారు.
ఆ తర్వాత సినిమా రంగంలోకి కూడా ప్రవేశించారు సత్యానంద్. పలు సినిమాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారు. మంచుపల్లకి, శ్రీమతి కావాలి, కలికాలం, ఆడది, కళ్లు, చైతన్యం, వంటి చిత్రాలకు సత్యానంద్ కో-డైరెక్షన్ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు యాక్టింగ్ స్కూల్ ప్రారంభించారు. సత్యానంద్ స్కూల్లో చేరిన పవన్, మహేష్, ప్రభాస్ వంటి ఎందరో నటులు.. నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే అగ్రహీరోలుగా వెలుగొందుతున్నారు.