Manchu Lakshmi: ప్రముఖ హీరో శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా రోజులుగా ఈ అంశంపై వివిధ కోణాల్లో చర్చలు జరుగుతూ వచ్చాయి. కొంతమంది శివాజీ ని తీవ్ర స్థాయిలో తప్పుబడితే , మరికొంతమంది మాత్రం శివాజీ కి సపోర్టు గా నిలిచారు. ఎక్కువ శాతం మంది శివాజీ కి సపోర్టు గా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అంశం ముగిసిన అధ్యాయం అనుకుంటే పెద్ద పొరపాటే. సందర్భం వచ్చినప్పుడల్లా దుస్తుల గురించి సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా నేడు జరిగిన ఒక ఈవెంట్ లో ఈ అంశం పై స్పందించడం గమనార్హం. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆహా మీడియా లో త్వరలోనే ‘ఇండియాస్ ఫస్ట్ ఎవర్ Influencer రియాలిటీ షో’ ప్రారంభం కాబోతుంది. ఈ షో కి ఒక న్యాయ నిర్ణేతగా లక్ష్మి ప్రసన్న వ్యవహరిస్తుండగా , హోస్ట్ గా యాంకర్ రష్మీ వ్యవహరించబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి హాజరైన మంచు లక్ష్మి , రిపోర్టర్ అడిగిన ఒక ప్రశ్న కు సమాధానం గా హీరోయిన్స్ వేసుకునే దుస్తుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మహిళలు వారికి నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఉంది. అందరికీ నచ్చే దుస్తులు వేసుకోవాలి అనే రూల్ లేదు. వాళ్లకు ఏది నచ్చితే అదే వేసుకోవచ్చు, దీనిపై మీడియా లో గత కొంతకాలంగా జరుగుతున్న సుదీర్ఘ చర్చ ని చూసి చాలా బాధపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇదే ఈవెంట్ లో ప్రముఖ బుల్లితెర సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ గురించి యాంకర్ రష్మీ ని అడిగిన ప్రశ్నకు కూడా మంచు లక్ష్మి మీడియా రిపోర్టర్ పై చిరాకు పడింది, అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
