Love Story: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్స్టోరీ’. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం.. హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. రిలీజ్ కు ముందు నుంచే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. రిలీజ్ వరకు ఆ టెంపోను కంటిన్యూ చేసింది. సారంగ ధరియా పాటతో మంచి ప్రమోషన్ దక్కింది. విడుదలైన తర్వాత కథ, కథనాలు ఆకట్టుకోవడంతో.. బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది.
ఇండియాతోపాటు ఓవర్సీస్ లోనూ లవ్ స్టోరీమూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రంపై టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ చూసి అందరూ అవాక్కయ్యారు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఏకంగా ఈ సినిమా 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. శేఖర్ కమ్ముల టేకింగ్ మీద ఉన్న నమ్మకంతో భారీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేశారు.
ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టుగా తెలుస్తోంది. నైజాం హక్కులు 11 కోట్లు పలికినట్టు సమాచారం. ఓవర్సీస్ లోనూ భారీ ధరకే సినిమాను కొనుగోలు చేసినట్టు సమాచారం. మిగిలిన శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్నీ కలిపి 50 కోట్లు మేర బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ బిజినెస్.
అయితే.. అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకుండా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లకు దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీంతో.. సక్సెస్ మీట్ నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం (సెప్టెంబర్ 28) 6 గంటలకు హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి హీరో నాగార్జునతోపాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా హాజరుకాబోతున్నారు.