Amaravati Capital: అమరావతి రాజధాని( Amravati capital ) విషయంలో మరో ముందడుగు. అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఫేజ్ 3 పనులను ప్రారంభించారు. ప్రధానంగా మూడో దశలో 3.51 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ కారిడార్ ఉండడం గమనార్హం. అమరావతి రాజధాని లో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు అత్యంత ప్రధానమైనది. మూడో దశలో బ్యారేజీ దగ్గరగా ఉన్న పంపింగ్ స్టేషన్ వెనుక భాగంలో మొదలై.. గుంటూరు ఛానల్, కొండవీటి వాగు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలను దాటి .. పాత జిటి రోడ్డుపై ఉన్న ఆర్చ్ బ్రిడ్జి మీదగా.. సీతానగరం కొండ పక్క నుంచి వెళ్లి ఆపై మణిపాల్ ఆసుపత్రి వద్ద ఉన్న జాతీయ రహదారిలో కలుస్తుంది.
* కీలక రోడ్డుగా..
అమరావతి రాజధానికి సంబంధించి కీలకమైన రోడ్డు ఇది. మణిపాల్ ఆసుపత్రి వద్ద ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను నిర్మిస్తారు. సీడ్ యాక్సిస్( seed axis ) 1, 2 పనులను చేస్తున్న కాంట్రాక్టర్.. ఇప్పుడు ఈ ఫేజ్ 3 పనులను దక్కించుకోవడం విశేషం. కొత్తగా ఈ రోడ్డు నిర్మాణాలతో పాటు కొండవీటి వాగు, గుంటూరు చానల్ పై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పైల్స్ పనులు కూడా మొదలయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 3 పనుల అంచనా వ్యయం రూ.512 కోట్లు. ఇతర ఖర్చులతో మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ పై 262 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మిస్తారు. వాటి తరువాత కూడా ఒక 100 మీటర్ల పొడవైన రోడ్డు నిర్మించనున్నారు. అక్కడ నుంచి నేరుగా ఎలివేటెడ్ కారిడార్ మొదలుకానుంది.
* ఎనలేని ప్రాధాన్యం..
అమరావతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. వీలైనంత త్వరగా అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని చూస్తోంది. అయితే అమరావతికి మణిహారంగా సీడ్ యాక్సిస్ రోడ్డు, దాని అనుబంధ రహదారులు నిలవనున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులపై ఫుల్ ఫోకస్ పెట్టింది. రవాణా మార్గాలను మెరుగుపరచడం ద్వారా అమరావతి నిర్మాణ పనులను మరింత సులభతరం చేయవచ్చని అంచనా వేస్తోంది. మొత్తానికి అయితే అమరావతి రాజధాని అంతర్గత నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు అదే స్థాయిలో జరపనుండడం.. గొప్ప పరిణామం.