తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చిత్రబృందం చెన్నైలోని ఓ స్టూడియోలో తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె చీర పట్టుకుని లాగడం కూడా ఒకటి. ఆ సన్నివేశాన్నే త్వరలో షూట్ చేయనున్నారు.
కాగా ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. పైగా అమ్మ బయోపిక్, తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా చేస్తున్నారు.
జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.