కేసీఆర్ ప్రభుత్వానికి సీఎం సహాయ నిధిని ఎలా వినియోగించాలో తెలియడం లేదా ? సీఎం రిలీఫ్ నుండి డబ్బులు ఇస్తున్నారంటే దానికి బాధ్యత సీఎంది కాదా ?, ఎవరికి సాయం చేయాలో ? ఎవరికీ చేయకూడదో చెప్పే అర్హత మనకు లేకపోవచ్చు, కానీ ఈ కరోనా కష్ట కాలంలో కనీసం మందులు కొనుక్కోలేక చనిపోతున్న లక్షల మంది పేద వాళ్ళు ఉన్న ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వారికే కేసీఆర్ ప్రభుత్వం సాయం చేయడం మన దౌర్భాగ్యం.
లక్షలు సంపాదన ఉన్న వ్యక్తికి సీఎం సహాయనిధి నుండి డబ్బులు ఇస్తారా ?, సినీ గేయ రచయిత కందికొండ గిరి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన కేటీఆర్, ప్రభుత్వం తరుపున కందికొండకు సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
మంచిందే, కందికొండకి సాయం చేయడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కందికొండ , బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు తెలంగాణ యాసలో రాసి పేరు తెచ్చుకున్నారు. అలాగే, దేశముదురు, పోకిరి, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు మొత్తం వెయ్యికి పై చిలుకు పాటలు రాశారు.
అంటే, ఆర్థికంగా కందికొండ ఎందరో పేద వాళ్ళ కంటే, ఉన్నత స్థితిలో ఉన్నట్టే కదా. ఆ మధ్య జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి లోనైందని, తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించారు. అవినాష్ కి లక్షల సంపాదన ఉంది. హైదరాబాద్ లో రెండు ప్లాట్స్ ఉన్నాయి. ఒక కారు మెయింటైన్ చేసున్నాడు. మరి ఇలాంటి ప్రముఖ వ్యక్తులకు ప్రభుత్వం తరఫున సాయం ఎలా చేస్తారు ?
ఎంతమంది పేదలు లేరు, వారి కోసం ఎప్పుడైనా ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయ నిధిని ప్రకటించిందా ? ఈ రోజు కరోనాతో సరైన వైద్యం అందక చనిపోతున్న ప్రతి ఒక్కరి చావుకి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఓ భాగం కాదని దైర్యంగా చెప్పగలరా ? ఏది ఏమైనా సామాన్యులకు అందాల్సిన సాయాన్ని, గుర్తింపు, లేదా పలుకుబడి ఉన్నవారికి అందించడం కేసీఆర్ ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది.