Janasena : ఏపీలో జనసేనపై కుట్ర జరుగుతోంది. కులముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. అటు ఎల్లో మీడియా, ఇటు నీలిమీడియా పని గట్టుకొని ప్రయత్నాలు ప్రారంభించాయి. పవన్ సాయం టీడీపీకి చేరేలా చూస్తూనే.. ఆయన నాయకత్వాన్ని బలహీనం చేసేందుకు ఎల్లో మీడియా.. పవన్ ను కాపు కులానికే పరిమితం చేసి మిగతా వర్గాల్లో విష బీజాన్ని నింపేందుకు నీలి మీడియా కుట్రపూరిత రాతలతో రోత పుట్టిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరే విషయంలో పవన్ పాత్ర ఉన్నట్టు నీలిమీడియా కథనాలు వండి వార్చుతోంది. పవన్ ను బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోంది.
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. 1989 నుంచి 2014 వరకూ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక పోర్టు పోలియోలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత బీజేపీ గూటికి చేరారు. దీంతో హైకమాండ్ ఆయనకు రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించింది. కన్నా రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయనొక సీనియర్ నాయకుడు. అటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీని వీడడానికి ఎన్నోరకాలుగా విశ్లేషించుకొని ఉంటారు. మరో పార్టీలో చేరడానికి అధ్యయనం చేసి ఉంటారు. భవిష్యత్ రాజకీయాలను అంచనా వేసి ఉంటారు. కానీ పవన్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో ఆయన బీజేపీకి దూరమయ్యారని.. టీడీపీలో చేరాలనుకుంటున్నారన్న ప్రచారంతో నీలిమీడియా రెచ్చిపోతోంది.
వాస్తవానికి ప్రజారాజ్యంపై జరిగిన కుట్రే జనసేనపై కొనసాగింది. కానీ పవన్ తట్టుకొని నిలబడగలిగారు. ప్రధానంగా కాపుల పార్టీగా ముద్ర వేయాలని భావించారు. కానీ పవన్ మాత్రం తాను అందరివాడినని చెప్పుకొచ్చారు. ఎక్కడా కుల ప్రస్థావన తీసుకురావడం లేదు. అంతెందుకు టీడీపీ, వైసీపీలపై కుల ప్రభావం లేదా? అంటే సమాధానం లేదు. వైసీపీ అంటే రెడ్లు, టీడీపీ అంటే కమ్మలు ఆ పార్టీలను ఓన్ చేసుకోలేదా? మిగతా వర్గాల వారూ ఆ పార్టీలను ఆదరించలేదా? కానీ జనసేన విషయంలో అలా కాకుండా పూర్తిగా కాపుల పార్టీగా చూపించాలన్నదే ఎల్లో, నీలి మీడియాల టాస్క్. అందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలో చేరేలా పవన్ ప్రోత్సహించారన్న ప్రచారాన్ని మరింత పదునెక్కిస్తున్నారు.
అయితే ఒక అభూతకల్పనగా చూపించే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో పవన్ బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కు సన్నిహితుడైన కామినేని శ్రీనివాస్ టీడీపీలో చేరాలని భావించారని.. కానీ నాడు చంద్రబాబు వద్దని పవన్ కు వారించారని.. బీజేపీలో చేర్పించి మంత్రి పదవి ఆఫర్ చేశారని..టీడీపీలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తోందని..బీజేపీ కోటాలోకి చేర్చి కామినేని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను పవన్ అనుసరిస్తున్నారని.. కన్నా జనసేనలో ఉంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తోందని.. అందుకే టీడీపీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కేలా కన్నాను టీడీపీ గూటికి పవన్ చేర్చుతున్నారని నీలి మీడియా ప్రచారం చేస్తోంది. తనపై కుల ముద్ర పడుతుందని భావించి..నాడు చంద్రబాబు అనుసరించిన ఫార్ములాతో పవన్ ఈ నిర్ణయానికి వచ్చారన్న అభూతకల్పనకు తెరతీసింది.