Sree Vishnu: విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి ని అందించాలనే తపనతో పని చేసే హీరోల్లో ఒకరు శ్రీ విష్ణు(Sree Vishnu). ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి శ్రీ విష్ణు కి మార్కెట్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పడేలా చేశాయి. రీసెంట్ గానే ‘సింగిల్’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న శ్రీవిష్ణు, తన తదుపరి చిత్రంగా ‘విష్ణు విన్యాసాలు’ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. ఈ నెల 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అదే రోజున శ్రీవిష్ణు మరో చిత్రం ‘మృత్యుంజయ్’ కూడా విడుదల కాబోతుంది. ఇలా శ్రీ విష్ణు కి సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజున బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల కాబోతున్నాయి.
ఇలా గతం లో నందమూరి బాలకృష్ణ, నేచురల్ స్టార్ నాని విషయాల్లో జరిగింది. బాలకృష్ణ హీరో గా నటించిన ‘నిప్పు రవ్వ’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు అప్పట్లో ఒకే రోజున విడుదల అయ్యాయి. ఇక ఆ తర్వాత చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘పైసా’, ‘జండాపై కపిరాజు’ చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత ఒక పేరున్న హీరో సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ‘విష్ణు విన్యాసాలు’ చిత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కగా, ‘మృత్యుంజయ్’ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సాధారణంగా ఇలా ఒకే హీరో కి సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజులో విడుదల చేయకపోవడమే మంచిది అనేది విశ్లేషకుల అభిప్రాయం. రెండు చిత్రాలకు సంబంధించిన నిర్మాతల మధ్య సఖ్యత లేనప్పుడే ఇలాంటివి జరుగుతాయి అని అంటుంటారు.
‘మృత్యుంజయ్’ చిత్రానికి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా, సందీప్ గుణ్ణం, వినాలి చిలకపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అయ్యింది. ఆర్ధిక సమస్యల కారణంగా ఈ చిత్రాన్ని ఇన్ని రోజులు విడుదల చేయలేకపోయినట్టు తెలుస్తోంది. శ్రీ విష్ణు ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన ద్రుష్టి మొత్తం ‘విష్ణు విన్యాసాలు’ చిత్రం మీదనే ఉంది. ఈ చిత్రానికి మారుతీ రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 27 న విడుదల అవ్వబోతున్న ఈ రెండు శ్రీ విష్ణు సినిమాల్లో ఏది ప్రజాధారణ అందుకుంటుందో చూడాలి.