Homeఆంధ్రప్రదేశ్‌నిమ్మగడ్డకు గవర్నర్ క్లాస్..! అందుకే ఈ మార్పునా?

నిమ్మగడ్డకు గవర్నర్ క్లాస్..! అందుకే ఈ మార్పునా?

‘రాజ్యగాంగబద్ధ పదవుల్లో ఉన్నవారితో సహా ఎవరూ హద్దులు మీరొద్దు. అందరూ తమ పరిధిని గుర్తుంచుకుని నడుచుకుంటే మంచిది. ప్రభుత్వంతో కలిసి పనిచేయకుండా.. ఒంటెద్దు పోకడలు పోతే మీరే చిక్కుల్లో పడతారు.’ అంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందర్ హితబోధ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ఒక్కరితో సాధ్యం కాదని.. ప్రభుత్వ యంత్రాంగం సాయం తీసుకుని ముందుకు సాగాలని సూచించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర అధికార యంత్రాంగం ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై నిమగడ్డ తీసుకున్న నిర్ణయంపై కూడా గవర్నర్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.

నిమ్మగడ్డ రమేశ్ తన పరిధిని అతిక్రమించి.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి చర్యలతో ఉన్నతాధికారుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండి పడుతున్నారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను కలవాల్సిందిగా.. గవర్నర్ హరిచందర్ ఇటీవల నిమ్మగడ్డకు పిలుపు అందించారు. దాంతో నిమ్మగడ్డ రాజ్ భవన్ కు వెళ్లాడు. దాదాపు 40 నిమిషాలు గవర్నర్ తో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరు పంచాయతీరాజ్ అధికారులపై ఎందుకు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్ కు లేదని ఎస్ఈసీకి గవర్నర్ సూచించినట్లు తెలిసింది. సుప్రీం కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న తీరుతో ఉన్నతాధికారులు వ్యవహరించారని , అదే తప్పు కాదని గవర్నర్ అన్నట్లు తెలిసింది. కరోనా వ్యాక్సినేషన్ ఉన్నందున ఉద్యోగ సంఘాలు ఎన్నికల వాయిదాను కోరాయి తప్పా.. ఇతర కారణాలు ఏమున్నాయని అడిగినట్లు సమచారం. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంపై తన వద్ద మొత్తం సమాచారం ఉందని గవర్నర్ అనడంతో నిమ్మగడ్డ నిమ్మకుండిపోయినట్లు తెలిసింది.

గవర్నర్‌ మాటలు నిమ్మగడ్డ రమేష్‌పై బాగానే ప్రభావం చూపించాయనిపిస్తోంది. ఆయనతో భేటీ అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన తీరే ఇందుకు నిదర్శనం. సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్, పంచాయతీ రాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌లతో సహా ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగంతో రోజువారీ సమీక్ష, సమన్వయ బాధ్యతలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నిర్వర్తిస్తారని, ఆయన ఆదేశాలను పాటించాలని నిమ్మగడ్డ.. కలెక్టర్లకు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version