Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Political Entry: రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. నేను లేస్తే మనిషిని కాదురా సామెత టైపు..

Rajinikanth Political Entry: రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. నేను లేస్తే మనిషిని కాదురా సామెత టైపు..

Rajinikanth Political Entry: రజనీకాంత్ గొప్ప నటుడు. అందులో అనుమానం లేదు. పైగా అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జపాన్ నుంచి మొదలు పెడితే దక్షిణ కొరియా వరకు అతడికి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఎక్కడో కర్ణాటకలో ఒక మామూలు బస్సు డ్రైవర్ ఈ స్థాయి దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. రజనీకాంత్ నటుడిగా ఓకే.. మిగతా విషయాల్లో ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజనీకాంత్ ఎప్పుడూ మాట్లాడినా సరే అది సత్య దూరంగానే ఉంటుంది.

పొలిటికల్ ఎంట్రీ గురించి రజనీకాంత్ అనేక సందర్భాల్లో అనేక డైలాగులు చెప్పారు. కానీ అవేవీ నిజం కాలేదు. ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు లేవు. “నేను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవచ్చు.. ఇప్పుడు నాకు 76 ఏళ్ళు వచ్చేసాయి. నా వ్యక్తిగత కారణాలవల్ల పార్టీని ఏర్పాటు చేయలేదు. గెలిచిన విజయ్ అభినందనీయుడు” అని చెప్పకుండా.. ముఖ్యమంత్రిగా కమల్ హాసన్ అయివుంటే ఇబ్బంది పడేవాడిని.. విజయ్ నాకు సరైన పోటీదారు కాదు అంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన బి గ్రేడ్ స్థాయిలో ఉంది.

ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు గానీ.. 1995లో ఎన్టీఆర్ ను దించేసిన తర్వాత.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నాడు రజనీకాంత్ హైదరాబాద్ వచ్చారు. విపరీతమైన హడావిడి చేశారు. మోహన్ బాబు, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత 1996లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. విమానం కూడా ఎక్కారు. ఏం జరిగిందో తెలియదు మనసు మార్చుకున్నారు. మద్రాసు విమానాశ్రయం ముందు రజనీకాంత్ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు కనపడకుండా వెళ్లిపోయారు. రెండు గంటలు అక్కడి విమానాశ్రయంలోనే ఉండిపోయారు.

, జయలలిత కాన్వాయ్ వెళ్తుంటే తన కారు ఆపారని రజనీకాంత్.. నాటి ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. అప్పట్లోనే ఆయనే రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. జయలలిత అనారోగ్యంతో గతించిన తర్వాత.. ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. నాటి ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థులను దారుణంగా ఓడించాడు. 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

అప్పుడు రజనీకాంత్ 2017లో తన అభిమాన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టే విషయం గురించి ఆలోచిస్తారని అన్నారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని కూడా చెప్పారు. కానీ ఆ ప్రకటన అలాగే ఉండిపోయింది. 2020 లో కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఏమైందో తెలియదు మూడు పేజీల లేఖ రాశారు. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. అంటూ అందులో పేర్కొన్నారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యాడు. కనీసం ఆ ప్రయత్నాన్ని కూడా రజనీకాంత్ చేయలేదు.

ఇప్పటికీ రజనీకాంత్ అభిమానుల్లో ఆ నిరాశ ఉంటూనే ఉంటుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ గెలిచాడు. ఆ విషయాన్ని కూడా సంపూర్ణంగా వ్యక్తం చేసే స్థితిలో రజనీకాంత్ లేడు. 1994లో చిరంజీవి గనుక రాజకీయాల్లోకి వచ్చి ఉంటే.. 1996లో రజనీకాంత్ రంగంలోకి దిగి ఉంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత లాస్ట్ పంచ్ ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది.. రాజకీయాల్లో భాషా వందసార్లు చెప్పవచ్చు. కానీ అది ఒక్కదానితో కూడా సమానం కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version