YSR Congress Party Protests: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టార్గెట్ అవుతూనే ఉంది. గతంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వారికి అడ్డు తగులుతున్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు పెరిగాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అప్పట్లో మంత్రులుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని చంద్రబాబుతో పాటు టిడిపి నేతలను అమ్మనా బూతులు తిట్టారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వం అని.. అది కేంద్రం పరిధిలో ఉండే అంశమని.. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అప్పట్లో ఫైర్ అయ్యారు. అప్పటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు. ఆపై మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జంతు ప్రేమికులకు టార్గెట్ అయింది.
* మొన్ననే తిరుపతిలో..
మొన్ననే తిరుపతిలో పెట్రోల్ దొరకడం లేదు అంటూ.. ఎద్దుల బండి పై ఆటోను పెట్టి.. ఆపై వైసీపీ నేతలు బండిపై నిలబడి.. ఆ మూగ జీవిని తీవ్ర అసౌకర్యానికి గురయ్యేలా చేశారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బుల్లితెర నటి, యాంకర్ రష్మీ గౌతమ్ అయితే బాహటంగానే వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో ఆమెపై ట్రోల్ చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే నిన్నను జరిగిన పెట్రోల్ ఆందోళనల విషయంలో ఓ చోట గాడిదలపై.. ద్విచక్ర వాహనాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ మూగజీవులపై ద్విచక్ర వాహనాలు పెట్టడంతో రక్తస్రావం అయింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వీడియోలు రావడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది.
* జంతు ప్రేమికుల నుంచి విమర్శలు..
పెట్రోల్ డీజిల్ పై ఆందోళనలు చేయాలంటే అనవసరంగా మూగజీవులను ఎందుకు తెస్తున్నారు అనేది జంతు ప్రేమికుల ప్రశ్న. ఆందోళనను నిర్వహించుకోవడం తప్పులేదు కానీ.. ఇలా మూగజీవాలను అడ్డం పెట్టుకోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రజా పోరాటాలు చేసింది చాలా తక్కువ. ఇలా చేస్తున్న క్రమంలోనే కనీసం సామాజిక బాధ్యత పాటించకుండా.. పశువులను ఉపయోగిస్తుండడం ఎంత మాత్రం సహేతుకం కాదు. గుణపాఠాలు నేర్చుకోకుంటే మాత్రం ఆ పార్టీకి నష్టం.
