God Movie Review: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటించే సినిమాలు మంచి హిట్ ను అందుకుంటాయి. రీసెంట్ గా జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ లేడీ స్టార్. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటూ ది గ్రేట్ హీరోయిన్ గా నిలుస్తుంది కూడా. అయితే హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. తాజాగా ఆమె జయం రవితో కలిసి `గాడ్` మూవీలో నటించింది. ఐ అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, జి జయరాం, సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ గత వారం విడుదలైంది. తాజాగా నేడు తెలుగులో రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సీటీలో సైకో కిల్లర్ వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణంగా చంపేస్తుంటాడు. న్యూడ్గా చంపివదిలేస్తుంటాడు. తన సింబల్గా స్మైల్ గుర్తులను వదులుతాడు. అలా స్మైలీ సైకో కిల్లర్గా పాపులర్ అవుతాడు. ఆ కేసుని పోలీస్ ఆఫీసర్స్ అర్జున్, ఆండ్రూ డీల్ చేస్తుంటారు. అనేక హత్యల అనంతరం ఎట్టకేలకు కిల్లర్ని పట్టుకుంటారు. అతడు స్మైలీ కిల్లర్ బ్రహ్మా గా గుర్తిస్తారు. కానీ అతన్ని పట్టుకునే సమయంలో జరిగిన గొడవలో ఆండ్రూ చనిపోతాడు. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకునే సమయంలో కొన్ని రోజులకు ఆ కిల్లర్ ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. మళ్లీ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. టార్గెట్ అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. అలా బంధువు కూతురు కిడ్నాప్ చేసి చంపేస్తాడు. ఆ కసితో బ్రహ్మాని పట్టుకుని చంపేస్తారు అర్జున్ అండ్ పోలీస్ టీమ్. కానీ మళ్లీ అదే స్టయిల్లో అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి కొత్తగా జరిగే హత్యలకు కారకులు ఎవరు? ప్రాణంగా ప్రేమించే ప్రియాని అర్జున్ ఎందుకు దూరం పెడుతున్నాడు? ఆ తర్వాత చోటు చేసుకున్న ట్విస్ట్ లేంటి? అనేది సినిమా.
మర్డర్ మిస్టరీలు, సైకో కిల్లర్ చేసే హత్యల నేపథ్యంలో అనేక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, సైకో థ్రిల్లర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని హిట్, మరికొన్ని ఫట్టు. ఇలాంటి సినిమాల్లో ఎంగేజింగ్ స్క్రీన్ప్లే ముఖ్యం. ట్విస్ట్ లు వాహ్ అనిపించాలి. ఆడియెన్స్ ని థ్రిల్కి గురి చేయాలి. సినిమా రేస్ గా సాగాలి. అప్పుడే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సక్సెస్ సాధ్యమవుతుంది. లేదంటే రొటీన్ మూవీ ట్రాక్లో పడిపోతుంది. జయం రవి, నయనతార కలిసి నటించిన `గాడ్` చిత్రం కూడా ఈ విషయంలో రొటీన్ ట్రాక్లోనే పడిపోయిందని చెప్పొచ్చు. నెక్ట్స్ ఏం జరుగుతుంది? ఎలాంటి సీన్లు ఎదురవుతుంటాయనేది ఊహించేలా, అర్థమయ్యేలా ఉండటం ఈ సినిమాకి మైనస్. నయనతార, జయం రవి నటించిన సినిమా అంటే ఆడియన్స్ లో మంచి అంచనాలుంటాయి. బలమైన కంటెంట్ ఉంటుందనే భావనలో ప్రేక్షకులు ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఈ విషయంలో నిరాశ పరిచింది. రొటీన్ సీన్లు, రొటీన్ హత్యలు, ఇన్వెస్టిగేషన్ ఎంతకూ ముందుకు సాగకపోవడం విసుగు తెప్పిస్తుంది. కిల్లర్ ఎవడో తెలిసినా పోలీసులు ఏం చేయలేని స్థితిలో ఉండటం, ఇన్వెస్టిగేషన్ సీన్లు రేసిగా లేకపోవడంతో బోర్ తెప్పిస్తుంది.