బాలీవుడ్ ను కమ్మేసిన కరోనా కల్లోలం ఇప్పుడు టాలీవుడ్ కు పాకింది. ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో సినిమా విడుదల నుంచి షూటింగ్ ల వరకు అన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే బాలీవుడ్ కు కేంద్రమైన ముంబై, మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అందుకే మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ ఆగిపోయింది.
ఇక టాలీవుడ్ లో ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ కు కరోనా పాకింది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘సర్కారి వారి పాట’టీంను కరోనా మహమ్మారి పట్టేసింది. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.
బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ‘సర్కారి వారి పాట’ రూపొందుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు తాజాగా బ్రేక్ పడింది. దుబాయ్, గోవాలో షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్రం యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే సర్కారివారి పాట చిత్రం యూనిట్ లోని ఐదుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగా లేనందున సినిమా షూటింగ్ వాయిదా వేయాలని మహేష్ బాబు నిర్మాతలను కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కరోనా కల్లోలం దృష్ట్యా సినిమా షూటింగ్ వాయిదా వేయాలని టీం నిర్ణయించింది. ఇప్పటికే మొత్తం మూవీ యూనిట్ అందరికీ కరోనా టెస్టులను చేయించారు. ఐదుగురికి బయటపడడంతో ఇక షూటింగ్ ఆపేశారు. పరిస్థితులు మారాక మళ్లీ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్.