గతేడాది కరోనా లాక్ డౌన్ తో అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ.. ఎక్కువగా దెబ్బతిన్నది సినీ రంగమే. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అన్ని రంగాలూ వేగంగా గాడిలో పడ్డాయి. సినీ పరిశ్రమకు మాత్రం చాలా సమయం పట్టింది. థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం అక్టోబరులో అనుమతులు ఇస్తే.. మొదటి సినిమా డిసెంబరు 25న విడుదలైంది. ఆ తర్వాత సంక్రాంతి నుంచి సినిమాలు రావడం మొదలయ్యాయి. అప్పటికీ.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లో ఉంది.
ఈ విధంగా.. సినీ పరిశ్రమ కుదురుకోవడానికి చాలా కాలం పట్టింది. కానీ.. అది ‘మూణ్నెల్ల’ ముచ్చట మాత్రమే అయ్యేలా కనిపిస్తోంది. జనవరి 9న క్రాక్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు.. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన సినిమాలన్నీ ఆగిపోయే పరిస్థితి. అంటే.. సినిమా ఇండస్ట్రీ సంతోషం సరిగ్గా మూణ్నెల్లు మాత్రమే అన్నమాట.
ఇప్పుడు సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లపై ఆంక్షలు రావడం తథ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర వంటి చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లోకి వచ్చింది. కొన్ని చోట్ల థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి. దీంతో.. తెలుగునాట పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బహుశా.. తెలుగులో పూర్తిగా థియేటర్లు మూసే ఛాన్స్ లేకపోయినప్పటికీ.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన రావడం కన్ఫామ్ అనిపిస్తోంది. ఏప్రిల్ రెండో పక్షంలో ఈ నిర్ణయం అమల్లోకి రావొచ్చని కూడా అంటున్నారు. ఈ విషయం తెలియడంతోనే ఈ నెల 16న రిలీజ్ కావాల్సిన ‘లవ్ స్టోరీ’, 23న విడుదల కావాల్సిన ‘టక్ జగదీష్’ చిత్రాలు వాయిదా పడ్డాయని అంటున్నారు.
దీంతో.. ఆ తర్వాత రావాల్సిన చిత్రాలు కూడా వెనక్కి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మేలో ఆచార్య, నారప్ప, అఖండ వంటి పెద్ద చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాల రిలీజ్ కూడా వాయిదా పడడం దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. గతేడాది కూడా సరిగ్గా వేసవి ఆరంభానికి ముందే లాక్ డౌన్ మొదలైంది. ఇప్పుడు వేసవి మొదలైన తర్వాత మరోసారి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో.. సినీ పరిశ్రమ మరోసారి నష్టాలను చవిచూడడం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.