Chiranjeevi Gharana Mogudu: చిరంజీవి ఆ పది కోట్లే టాలీవుడ్ కు పునాదిరాళ్లు!

Chiranjeevi Gharana Mogudu: “ఎవరో ఒకరు ఎపుడో, అపుడు.. నడవరా అటో ఇటో ఎటో వైపు” సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ ఆణిముత్యం లాంటి పాట ఇది. ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరాన్ని నిజజీవితంలో చేసి చూపించినవాడు చిరంజీవి. మల్టీప్లెక్స్ లు మన పట్టణాల్లోకి చొచ్చుకు వచ్చేంతవరకు చిట్టచివరి మ్యాట్ని ఐడల్ కూడా చిరంజీవి అంటే అతిశయోక్తి కాకమానదు. తెలుగు తెరపై అంతటి ప్రభావం చూపించిన సుప్రీం హీరో అతడు. ఇప్పుడు తెలుగు […]

Written By: Bhaskar, Updated On : August 21, 2022 12:29 pm
Follow us on

Chiranjeevi Gharana Mogudu: “ఎవరో ఒకరు ఎపుడో, అపుడు.. నడవరా అటో ఇటో ఎటో వైపు” సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ ఆణిముత్యం లాంటి పాట ఇది. ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరాన్ని నిజజీవితంలో చేసి చూపించినవాడు చిరంజీవి. మల్టీప్లెక్స్ లు మన పట్టణాల్లోకి చొచ్చుకు వచ్చేంతవరకు చిట్టచివరి మ్యాట్ని ఐడల్ కూడా చిరంజీవి అంటే అతిశయోక్తి కాకమానదు. తెలుగు తెరపై అంతటి ప్రభావం చూపించిన సుప్రీం హీరో అతడు. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. బాహుబలి అయితే ఏకంగా 2000 కోట్ల మైలురాయికి దగ్గరలో నిలిచింది. కానీ టాలీవుడ్ ఇక్కడి దాకా రావడానికి చిరంజీవే కారణం. చదివేందుకు అతిశయోక్తిగా ఉన్నా ఇదే నిజం.

Chiranjeevi Gharana Mogudu

-అతడు మొదలుపెట్టాడు
1986లో కన్నడలో రాజ్ కుమార్, మాధవి, గీత కాంబినేషన్లో “అనురాగ అరలితు” అనే ఒక సినిమా విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా జనాలకి బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమా చిరంజీవికి బాగా నచ్చింది. అప్పట్లో రాఘవేంద్రరావు ఫామ్ లో ఉన్నాడు. దర్శకుడిగా అతడు ఓకే అయ్యాక, నగ్మా, వాణీ విశ్వనాథ్ ను హీరోయిన్లుగా అనుకున్నారు. కైకాల సత్యనారాయణ రావు, గోపాల్ రావు సహాయ నటుల పాత్రలు చేశారు. 1991లో షూటింగ్ ప్రారంభం అయింది. చెన్నై, హైదరాబాద్, ఇంకొన్ని అవుట్ డోర్ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మూడు కోట్ల బడ్జెట్ అయింది. కీరవాణి స్వర పరిచిన పాటలు ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా బంగారు కోడిపెట్ట పాట రెండు, మూడేళ్ల పాటు జనాల నోటి వెంట నానింది. అదే పాటను, అదే సంగీత దర్శకుడు ఈ చిత్రం హీరో కుమారుడు నటించిన మగధీర సినిమాలో రీమిక్స్ చేయడం విశేషం. కోటగిరి వెంకటేశ్వరరావు సారథ్యంలో ఎడిటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9 1992లో విడుదలైంది.

-సమ్మర్ లోనూ హారతులు పట్టారు
ఎండాకాలం అనేది సినిమా పరిశ్రమకు ఒక అన్ సీజన్ లాంటిది. అలాంటి సమయంలో ఘరానా మొగుడు రిలీజ్ అయింది. కన్నడలో హిట్ అయినప్పటికీ ఇక్కడ జనం ఆదరిస్తారా అని చిత్ర నిర్మాత దేవి ప్రసాద్ మదిలో చిన్న అనుమానం ఉండేది. కానీ దాన్ని పటా పంచలు చేస్తూ చిరంజీవి డ్యాన్సులు, కామెడీ టైమింగ్, పాటలు జనాలకు బాగా నచ్చాయి. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ రోజుల్లో ఈ సినిమా బడ్జెట్ మూడు కోట్లు అంటే సినీ పండితులు నోరు వెళ్ళబెట్టారు. ఆ తర్వాత కానీ చిరంజీవి మేనియా అర్థం కాలేదు. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో పది కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. చిరంజీవి దెబ్బకు అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ చెరిగిపోయాయి.

Chiranjeevi Gharana Mogudu

అప్పటిదాకా తెలుగు సినిమా మూడు కోట్లు వసూలు చేస్తేనే పరిస్థితి మహా గగనంగా ఉండేది. ఎప్పుడైతే ఘరానా మొగుడు సినిమా 10 కోట్లు వసూలు చేసిందో అప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి మారిపోయింది. నిర్మాతలు ధైర్యం చేసి భారీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించారు. ఘరానా మొగుడు తర్వాత నాలుగేళ్లకు వచ్చిన సమరసింహారెడ్డి 15 కోట్లు వసూలు చేసింది. 10 కోట్ల క్లబ్ తో మొదలైన తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి నేడు 2000 కోట్ల మైలురాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు పునాదిరాళ్లు వేసింది చిరంజీవి అంటే అతిశయోక్తి అస్సలు కాదు.

 

 

Tags