Lok Sabha Election 2024: దేశంలో 18వ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి దశలో 102 స్థానాలకు 20 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించింది. ఇక 17 సార్లు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే.. ఈసారి జరుగుతున్న ఎన్నికలు మరో ఎత్తు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఎన్నికలను పూర్తిగా సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు ఫాలోవర్లును విపరీతంగా పెంచుకుంటున్నాయని పేర్కొంటున్నారు.
2014 నుంచే..
ఎన్నికలపై గతంలో మీడియా(ప్రింట్, ఎలక్ట్రానిక్) ప్రభావం ఉండేది. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు ఇవే ప్రభావితం చేశాయి. దీంతో పత్రికలు, టీవీ చానెళ్లకు అన్ని పార్టీల అభ్యర్థులు విపరీతంగా ప్రకటనలు ఇచ్చేవారు. 2014 నుంచి సోషల్ మీడియా ప్రభావం మొదలైంది. ప్రస్తుతం ఉన్నంతగా నాడు సోషల్ మీడియా లేకపోయినా కొంత మొత్తంలో ప్రభావం చూపింది.
మోదీ ప్రధాని అయ్యాక..
ఇక నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఇంటర్నెట్ మరింత చౌకగా మారింది. రిలయన్స్ జియో అప్పటి వరకు ఉన్న సెల్యూలార్ కంపెనీలకన్నా తక్కువకే హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో సోషల్మీడియా, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగాయి. గడిచిన పదేళ్లలో అన్ని పార్టీలు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియా ద్వారా తమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ప్రత్యేక ఖతాలు తెరిచి ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డాయి.
ప్రత్యేక యూట్యూబ్ చానెళ్లు..
ఇక సోషల్ మీడియా ప్రభావం క్రమంగా పెరుగుతుండడంతో అన్ని పార్టీలు ప్రత్యకంగా యూట్యూబ్ ఛానెళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. పెద్దపెద్ద నాయకులు అయితే సొంతంగా యూట్యూబ్ ఛానెల్తోపాటు ప్రత్యేకంగా సొంత సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ కార్యక్రమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ అగ్రభాగంలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం..
ఇక 2014 ఎన్నికలను సోషల్ మీడియా అత్యంత ప్రభావితం చేయబోతోంది. ఇందుకు గడిచిన మూడు నాలుగు నెలలుగా ప్రధాన పార్టీలు విపరీతమైన ఫాలోవర్లను పెంచుకోవడమే నిదర్శనం. తమ కార్యక్రమాలతోపాటు, ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరవేస్తున్నారు.
పార్టీల ఫాలోవర్లు ఇలా..
ప్రస్తుతం అత్యం ఆదరణ ఉన్న సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్). దీనిపై అన్నిపార్టీలు దృష్టిపెట్టి ఫాలోవర్లను పెంచుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి గడిచిన మూడు నెలల్లో కొత్తగా 4 లక్షల యూజర్లు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 2.5 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్తగా 12 వేల మంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా 9 వేల పైచిలుకు మంది కొత్త ఫాలోవర్లు వచ్చారు. ఇక ఎక్స్ తర్వాత మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా కీలకంగా మారింది. దీనిలో కూడా బీజేపీకి 2.18 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 1.04 కోట్ల మంది ఉండగా, ఆప్కు 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
యూట్యూబ్లో ఆప్ టాప్..
ఇక తర్వాత ప్రభావం చూపే మరో సోషల్ మీడియా యూట్యూబ్లో ఆప్ పార్టీ అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ మాత్రం ఇందులో కాస్త వెనుకబడింది. ఆప్కు కొత్తగా 5.23 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరగా, మార్చి 20 తర్వాత(కేజ్రీవాల్ ఆరెస్ట్ అయ్యాక) కొత్తగా 3.06 లక్షల మంది సబ్ స్క్రైబర్లు వచ్చారు. బీజేపీకి మాత్రం జనవరిలో 3 లక్షల కొత్త యూజర్లు రాగా, ఫిబ్రవరి, మార్చితో తగ్గారు. మొత్తంగా బీజేపీకి మూడు నెలల్లో 5.03 లక్షల సబ్స్క్రైబర్లు ఉండగా, టీఎంసీ 28 వేల మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది. అయితే యూట్యూబ్లో బీజేపీ వీడియోలు చూస్తున్న వారి సంఖ్యమాత్రం విపరీతంగా పెరిగింది. ఏకంగా 43 కోట్ల మంది బీజేపీ వీడియోలు చూస్తున్నారు. తర్వాతి స్థానంలో ఆప్ 30.78 కోట్లతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వీడియోలను కేవలం 16.67 కోట్ల మంది మాత్రమే వీక్షిస్తున్నారు.