Lok Sabha Election
Lok Sabha Election: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలతోపాటు ప్రముఖులు బారుతు తీరారు. వేసవి నేపథ్యంలో ఉదయం 7 గంటలకే చాలా మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది.
ఓటేసిన ప్రముఖులు..
తెలంగాణలో సినీ నటులతోపాటు రాజకీయ ప్రముఖులు ఉదయమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ క్లబ్లోని పోలింగ్ కేంద్రంలో భార్య సురేఖతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్లో ఓటేశారు. ఓబుల్రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి శాలినితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేశ్బాబు, నమ్రత ఓటు వేశారు. నటుడు మంచు మోహన్బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటే వేశారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ ఓటేశారు. గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని ఓటుహక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని ఓటేశారు. జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో హీరో రవితేజ ఓటేశారు. మణికొండ హైస్కూల్లో హీరో వెంకటేశ్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో హీరో శ్రీకాంత్, విజయదేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రామ్చరణ్, ఉపాసన దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మణికొండ హైస్కూల్లో కమెడియన్ బ్రహ్మానందం ఓటేశారు. షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో రాజమౌళి తన భార్య రమతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్టు ప్రభుత్వ పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన భారతో కలిసి జూబ్లీహిల్స్లో ఓటు వేశారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తన సతీమణితో కలిసి మలక్పేట సలీంనగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఓటు వేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మాదాపూర్లో ఓటు వేశారు. ఎస్ఆర్నగర్లో సీఈవో వికాస్రాజ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మేడ్చర్ మండలం పూడురులో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఏపీలో ఓటేసిన ప్రముఖులు..
ఏపీలో కూడా చాలా మంది ప్రముఖులు ఉదయమే ఓటు వేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని రైల్వే కల్యాణమండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో భార్య భువనేశ్వరితో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.