CM Chandrababu: మెగా డీఎస్సీ పై చంద్రబాబు తొలి సంతకం.. పోస్టులు ఎన్నో తెలుసా?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు.

Written By: Dharma, Updated On : June 13, 2024 6:11 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: నిరుద్యోగులకు పండగే. ఏపీలో భారీ డీఎస్సీ భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు తిరుపతి వెళ్లారు. ఈరోజు వేకువ జామున స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాకు లోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెనాయుడు,కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో సచివాలయంలో సందడి నెలకొంది.

తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ పై చంద్రబాబు తొలి సంతకం చేశారు.తాను హామీ ఇచ్చినట్లుగానే భారీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి 6371, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 7725, పీఈటి 132, టీజీటీ 1781, పిటిజి 286, ప్రిన్సిపల్స్ పోస్టులు 52.. ఇలా మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం పెట్టారు చంద్రబాబు. సామాజిక పింఛన్ల మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతూ మూడో ఫైల్ పై సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు చంద్రబాబు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలకు మోక్షం లభించినట్లు అయిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.