ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి 10,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రులు, పడకలు, అంబులెన్స్ల వివరాలను ఏపీ ప్రజలు 104 కాల్ సెంటర్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 12,634 కేసులు నమోదు కాగా 69 మంది వైరస్ వల్ల చనిపోయారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ 104 కాల్ సెంటర్ కోసం అదనపు సిబ్బందిని నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వం వీళ్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోనుంది. ఇప్పటికే కాల్ సెంటర్ లో పని చేసిన అనుభవం ఉన్నవాళ్లకు, ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్, పీజీ చదివిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కనీసం డిగ్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గన్నవరంలో ఉన్న హెచ్.సీ.ఎల్ క్యాంపస్ లో నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. covid-19info@ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి, కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు 104 కాల్ సెంటర్ ఉద్యోగాల వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.