Ambani : రిన్ సబ్బుతో బట్టలు ఉతుకుతాం. ఆ ప్రొడక్ట్ హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీది. పిల్లలకు సెరిలాక్ పెడతాం. ఆ ఉత్పత్తి నెస్లె కంపెనీది. తలకు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ పెట్టి స్నానం చేస్తాం. అది పీఅండ్జీ కంపెనీ తయారు చేసింది. బాత్ రూం హార్ఫిక్తో శుభ్రం చేసుకుంటాం. ఆ ఉత్పత్తి రెకిట్ అనే కంపెనీ నుంచి వచ్చింది. ఇలా మన దైనందిన జీవితంలో వాడే ప్రతీ వస్తువు ఈ కంపెనీల నుంచి వచ్చేదే. ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీలు మన దేశంలో పాతుకుపోయాయి. ఏటా వేల కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో ఈ కంపెనీలు నిర్ణయించిందే ధర! అయితే ఈ కంపెనీలకు పోటీగా అంబానీ రాబోతున్నాడు. ఈ కంపెనీలకు చెక్ పెట్టేందుకు, వాటి మార్కెట్ వాటా కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు.
సాఫ్ట్ డ్రింక్స్ విభాగంలో..
80 దశకాల్లో ఇండియాను షేక్ చేసి తర్వాత మూత పడిన కంపా డ్రింక్ను ఇటీవల కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ.. ఆ ప్లాంట్లో ఉత్పత్తి కూడా మొదలు పెట్టాడు. గతంలో ఉన్న ఫ్లేవర్లను అలాగే ఉంచి.. ఇప్పటి ట్రెండ్కు అనుకూలంగా కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టనున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కంపా ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న పెప్సీకో హోల్డింగ్స్, కోకోకోలా, పార్లే అండ్ అగ్రో కంపెనీలకు చెక్ పెట్టే ప్రయత్నాలు అంబానీ ముమ్మరం చేశాడు. ఈ ఉత్పత్తులను తన రిలయన్స్ మార్ట్ ద్వారా విక్రయాలు మొదలు పెట్టాడు.
పర్సనల్ కేర్లోకి..
సాఫ్ట్డ్రింక్ విభాగంలో ఽధరల యుద్ధానికి తెరలేపిన రిలయన్స్.. తాజా ఎఫ్ ఎం సీజీలోని పర్సనల్ కేర్, హోమ్ కేర్ విభాగాల్లోకి సైతం ప్రవేశించింది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే, 30 నుంచి 35 శాతం తక్కువ ధరకే ఈ విభాగాల్లో ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. అయితే ఈ వ్యూహం కంపెనీకి ఆశించిన లాభాలను ఇస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. చౌక ధరలకు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఉత్పత్తులు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్)కు చెందిన ఎఫ్ ఎం సీజీ అను బంధ విభాగమైన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(ఆర్సీపీఎల్) విడుదల చేసిన ఉత్పత్తులు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబా టులో ఉంటాయి.
ధరలపై సమర శంఖం
గతంలో రిలయన్స్ జియోను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ధరల యుద్ధానికి అంబానీ సమర శంఖం పూరించారు. జియో చౌక డేటా, అపరిమితమైన కాలింగ్ సేవలతో టెలికం రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మిగతా సంస్థలూ ధరలను తగ్గించడంతో దేశంలో డేటా, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ఎఫ్ ఎంసీజీ లోనూ రిలయన్స్ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుం టోంది! ఇక రిలయన్స్ తన నెట్వర్క్ను విస్తృతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఎఫ్ ఎంసీజీ రంగం 11,000 కోట్ల డాలర్ల(9 లక్షల కోట్ల పై మాటకు) స్థాయికి చేరుకుంది.