Cyber Crime : మీ డబ్బులు సేఫ్ గా ఉండాలంటే వాట్సాప్ వాడే వారంతా దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్న వాటిని సైబర్‌నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని ఫోన్లు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.

Written By: Rocky, Updated On : October 26, 2024 7:25 pm

Cyber Crime

Follow us on

Cyber Crime :‘మీ కొడుకును మేం అరెస్ట్ చేశాం.. మాకు డబ్బులు పంపిస్తే వదిలేస్తాం.. లేదంటే కాల్చి చంపేస్తం’ అంటూ సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలో బెదిరింపులకు దిగుతూ దోచేస్తున్నారు. లండన్‌ నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ పాకిస్థాన్‌ కోడ్‌తో వచ్చే నంబర్లతో వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్న వాటిని సైబర్‌నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని ఫోన్లు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తమ పిల్లలు చదువు, ఉద్యోగాల నిమిత్తం ఆయా ప్రదేశాలకు వెళ్లడంతో నిజంగానే ఆపదలో చిక్కుకున్నారేమో అని తల్లిదండ్రులు భయపడుతూ నేరగాళ్లకు డబ్బులు పంపి మోసపోతున్నారు. ఒకవేళ యూకేలో తమ పిల్లలు విదేశాల్లో లేరని చెబితే ముంబై, ఢిల్లీ ఇలా ఏదో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆందోళన కలిగేలా చేస్తున్నారు. నేరుగా ఫోన్‌ చేసి బెదిరించే ముఠాలు కొన్ని అయితే, మరికొన్ని ముఠాలు పోలీస్‌ దుస్తులు వేసుకుని ‘మేం పోలీసులం మీ పిల్లలను అరెస్ట్ చేశాం’ అంటూ వివిధ కేసుల వివరాలు చెబుతూ నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు.

వాట్సాప్‌ కాల్స్‌తోనే!
ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ క్రిమినల్స్ ఎక్కువగా వాట్సాప్‌ కాల్స్‌తోనే మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మొదట సాధారణ కాల్‌ చేసి డ్రగ్స్‌, మనీలాండరింగ్‌ నేరాలు మీ ఆధ్వర్యంలో జరిగాయంటూ బెదిరిస్తున్నారు. అలాంటి బెదిరింపులకు భయపడి స్పందిస్తే వెంటనే మా పై పోలీస్‌ అధికారి మాట్లాడుతాడంటూ మాట్లాడిస్తూ ఆందోళనను ఎక్కువ చేస్తున్నారు. ‘మీవాడు కేసుల్లో ఇరుక్కున్నాడు.. మా అదుపులో ఉన్నాడు, డబ్బులివ్వకపోతే కాల్చేస్తాం.. మీ పేరుతో పార్సిల్‌ ఒకటి దొరికింది.. అందులో మీ ఫోన్‌ నంబర్‌ ఉంటుంది. ఇది డ్రగ్‌ మాఫియా లింక్‌కు సంబంధముంది.. దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌లతో మీకు సంబంధాలు ఉన్నట్లు క్రియేట్ చేస్తాం’ అంటూ బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. పోలీసులమని చెప్పుకొనే కొందరు వాట్సాప్‌లో వీడియో కాల్స్‌, స్కైప్‌ కాల్స్‌ చేసి ఓవైపు సహాయం చేస్తున్నట్లే నటిస్తూ మరోవైపు ‘మేం ఆర్బీఐ, సీబీఐ, ఎన్‌ఐఏ వాళ్లం.. మీ బ్యాంకు ఖాతాలు చెక్ చేయాలి.. అందుకు మీ ఖాతాలోని డబ్బు ఆర్బీఐకి పంపాలి’ అని మోసం చేస్తున్నారు. మీ ఆధార్ కార్డు చూపించండి లేదా పాన్ కార్డు చూపించండి అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తన్నారు. అనుమానాస్పద నంబర్లు, ఇతర దేశాల కోడ్‌లతో వచ్చే కాల్స్‌కు ఎవరూ బెదిరిపోవద్దని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

అంతే కాకుండా నిందితులు మరో అడుగు ముందుకేసి ‘మేం సీబీఐ పోలీసు లం. మీ పిల్లలు డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డరు. డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి’ అంటూ కొన్ని రోజుల క్రితం నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంతో పాటు మండలంలోని పలువురికి సీబీఐ పోలీస్‌ పేరిట వాట్సాప్‌ కాల్స్‌ వచ్చాయి. ఇలేగాం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కు ‘నీ కూతురు డ్రగ్స్‌ అమ్ముతూ దొరికింది. 10 నిమిషాల్లో మా దగ్గరికి రావాలి’ అని గుర్తుతెలియని వ్యక్తులు కాల్‌ చేశారు ఆందోళనకు గురైన వెంకటేశ్‌ బడికి వెళ్లి చూడగా అమ్మాయి క్షేమంగానే ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. స్టూడెంట్లను లక్ష్యంగా చేసుకుని వారి పేరు, తండ్రి పేరు, ఫోన్‌ నంబర్‌, ఊరి పేరు చెబుతూ ఫోన్‌ కాల్స్‌ చేస్తూ బెదిరిస్తున్నారు. అలాగే ఓ వృద్ధ దంపతుల నుంచి పోలీసు అధికారులమంటూ ఫోన్ చేసి రూ.10కోట్లు కాజేశారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి కాల్స్ వస్తే మేమే పోలీస్ స్టేషన్ కు వచ్చి తెలుసుకుంటామని కాల్ కట్ చేయాలి. స్కామ్ అని పసిగట్టి కాల్స్ కట్ చేయడం మంచింది.