Homeక్రైమ్‌Tamil Nadu Crime News: మూడేళ్ల కూతురి మాటలు.. తల్లి వివాహేతర సంబంధాన్ని రట్టు చేశాయి..

Tamil Nadu Crime News: మూడేళ్ల కూతురి మాటలు.. తల్లి వివాహేతర సంబంధాన్ని రట్టు చేశాయి..

Tamil Nadu Crime News: బంధాలు లేవు. అనుబంధాలు అంతకన్నా లేవు. అవసరాలే మనుషులకు ప్రాతిపదికగా మారిపోతున్నాయి. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను భార్య.. వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న భార్యను భర్త మోసం చేయడం వంటి ఘటనలు పరిపాటిగా మారిపోతున్నాయి. వీటన్నింటికీ కారణం వివాహేతర సంబంధాలే.. భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకుని వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. కన్న పిల్లలకు ద్రోహం చేస్తూ తలవంచుతున్నారు. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాలలో వివాహేతర సంబంధాలు.. వాటి వల్ల జరిగిన హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.. మేఘాలయ ఘటన తర్వాత ఇటువంటి దారుణాలు రోజుకోకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఒక దారుణం జరిగింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసులో మూడు సంవత్సరాల పాప చెప్పిన విషయాలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి.

అది తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా. ఈ జిల్లాలోని ఒడుకత్తూర్ గ్రామంలో భారత్ అనే వ్యక్తి వంట మాస్టర్ గా పనిచేస్తాడు. ఇతడి తమిళనాడు రాష్ట్రంలోని కుప్పం పాల్యం. ఇతడికి సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం బెంగళూరు ప్రాంతానికి చెందిన నందిని అనే యువతితో వివాహం జరిగింది. నందిని, భారత్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురుకు నాలుగు, చిన్న కూతురికి మూడు సంవత్సరాల వయసు ఉంటుంది.. భారత్ చెన్నైలోని హోటల్లో పనిచేస్తుంటాడు. వారాంతంలో ఇంటికి వస్తుంటాడు. ఇదే నెల 21న కుటుంబాన్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి కావలసిన సరుకులను కొనుగోలు చేయడానికి చిన్న కూతురుని తీసుకొని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్ళాడు.

అక్కడ సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా కొబ్బరి మట్టలు పెట్టారు. అయితే వాటిని దాటడానికి ప్రయత్నిస్తుండగా అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో అతడు కింద పడిపోయాడు.. ఇంతలోనే ఓ వ్యక్తి అమాంతం భారత్ మీద పడ్డాడు. పదునైన ఆయుధంతో చాతి భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ ను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉందన్న కోణంలో విచారించారు. అయితే పోలీసుల విచారణలో భారత్ కు శత్రువులు ఎవరూ లేరని తేలింది. దీంతో వారి అనుమానం భార్యపై కలిగింది. ఆమెను పోలీసులు విచారిస్తే పొంతనని సమాధానం చెప్పింది.

Also Read: ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. నాలుగు రోజుల పాటు డేంజర్!

భారత్ చనిపోయినప్పుడు అతని మూడు సంవత్సరాల కుమార్తె అక్కడే ఉంది. దీంతో ఆమెను పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నందినికి ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ అనే 21 సంవత్సరాల యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్దిరోజులుగా సంజయ్ తో ఆమె శారీరక సంబంధాన్ని కొనసాగిస్తున్నది.. భర్త ఎక్కడో చెన్నైలో ఉండడం.. సంజయ్ ఇంటి ఎదురుగా ఉండడంతో నందిని కి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో సంజయ్ ప్రతిరోజు రాత్రి నందిని ఇంట్లోనే ఉండేవాడు. ఇద్దరు కుమార్తెలను వేరే గదిలో పడుకోబెట్టి.. నందిని సంజయ్ తో సరసాలలో మునిగి తేలేది. పైగా తన కుమార్తెలకు సంజయ్ ని అంకుల్ గా పరిచయం చేసింది.. అయితే చిన్న కుమార్తె సంజయ్ ని చూడడం.. పోలీసులకు చెప్పడంతో వారు నందిని, సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజయ్ తో నందిని సాగిస్తున్న వ్యవహారం గతంలోనే భారత్ కంట్లో పడింది. దీంతో అతడు ఆమెను హెచ్చరించాడు. ఈ వ్యవహారం మానుకోవాలని సూచించాడు. ఐనప్పటికీ నందిని మానుకోలేదు. పైగా తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భారత్ ను తొలగించుకోవాలని నందిని, సంజయ్ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అతని ఇలా అదును చూసి మట్టుపెట్టారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసిన నేపథ్యంలో వారిద్దరినీ అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version