Bhupal Naik Fraud: పాలేరుగా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో చేరాడు. అనంతరం రకరకాల పనులు చేశాడు. వేషం మార్చాడు. సొంత ఊరికి వచ్చాడు. ఎకరాల భూమి కొన్నాడు. అందులో చేపల చెరువులు తవ్వించాడు. చుట్టూ బౌన్సర్లు.. ఖరీదైన కార్లు.. రేమండ్ సూట్లు.. బాటా బూట్లు.. చేతికి రోలెక్స్ గడియారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రేంజ్ మామూలుగా లేదు. ఒక పాలేరు నుంచి ఈ స్థాయి దాకా ఎదగడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని పాజిటివ్ కోణంలో కాకుండా.. మరో కోణంలో చూస్తే.. చూడ్డమేంటి ఆయన చేసింది అదే.. చివరికి ఏం జరిగిందంటే..
అతడి పేరు నేతావత్ భూపాల్ నాయక్. మహబూబాద్ జిల్లా కురవి మండలం కందికొండ ప్రాంతం.. ఇతడు కిసాన్ పరివార్ లిమిటెడ్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో సంస్థలను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత డిపాజిట్లు వసూలు చేశాడు. అసలుకు రెట్టింపు అని ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఏకంగా కొన్ని కోట్ల వసూలు చేశాడు. వాస్తవానికి ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టకూడదని.. అవి పూర్తిగా నిషేధమని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 2022లో జూలైలో ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఆ ప్రకటనను దాస్తూ భూపాల్ నాయక్ వందలాది మంది రైతులను మోసం చేశాడు. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ఆశించాడు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని ప్రకటించాడు. భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు. ర్యాలీలు.. సమావేశాలు భారీగా నిర్వహించాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బిల్డప్ కూడా ఇచ్చాడు.
కోట్ల వసూలు చేసిన భూపాల్ నాయక్ అనేక డొల్ల సంస్థల్లోకి వాటిని మళ్లించాడు. దీనికోసం 30 నుంచి 40 వరకు బ్యాంకుల ఖాతాలు ఉపయోగించుకున్నాడు. ఆ డబ్బులను తన అవసరాల కోసం మళ్లీ ఖాతాలలోకి మళ్లించి ఉపయోగించుకున్నాడు. ఇతడు ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో భూపాల్ నాయక్ మాత్రమే కాకుండా.. ఇంకా ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. కిసాన్ పరివార్.. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అత్యంత మోసపూరితమైనవని.. వీటిలో డబ్బులు ఎవరు పెట్టుబడులుగా పెట్టకూడదని గతంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ప్రకటించింది. కాకపోతే ఆ ప్రకటనను బయటికి రాకుండా చూసుకోగలిగాడు భూపాల్ నాయక్. చివరికి ఇతడి వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. తాము పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని బాధితులు ఇతడిని డిమాండ్ చేశారు. దీంతో అతడు ఒక మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించాడు. ఈ క్రమంలో వారంతా కూడా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి భూపాల్ నాయక్ అసలు రంగును బయటపెట్టారు. ఇతడి దందా వందల కోట్లలో సాగిన నేపథ్యంలో.. ఈడి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
