AEPS Fraud: ఇప్పుడు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు దొంగిలించడానికి OTP కూడా అవసరం లేకుండా పోతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా AEPS (Aadhaar Enabled Payment System) ఫ్రాడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం ఆధార్ నెంబర్, ఫింగర్ ప్రింట్ ఆధారంగా జరిగే ఈ మోసాల్లో అమాయక ప్రజలు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, వృద్ధులు, బ్యాంకింగ్ అవగాహన తక్కువగా ఉన్నవారు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. అసలు ఈ మోసం ఎలా జరుగుతందంటే?
AEPS అంటే ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ సేవ. ఇందులో ATM కార్డు, OTP, చెక్బుక్ అవసరం లేకుండానే డబ్బులు విత్డ్రా చేయవచ్చు. ఆధార్ నెంబర్, బ్యాంక్ పేరు, ఫింగర్ ప్రింట్ సరిపోతాయి. ఈ సౌకర్యాన్ని మోసగాళ్లు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఒకసారి బాధితుడి ఫింగర్ ప్రింట్ కాపీ దొరికితే AEPS ద్వారా ఖాతాలోని డబ్బులు తీసేస్తున్నారు.
సైబర్ క్రైమ్ దర్యాప్తుల్లో బయటపడిన విషయాలు మరింత షాకింగ్గా ఉన్నాయి. టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ డేటా రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి గ్యాంగ్లపై దాడులు చేసి ఫేక్ బయోమెట్రిక్ సిలికాన్ ప్రింట్లు, క్లోనింగ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మోసగాళ్లు గ్లాస్లు, మొబైల్ స్క్రీన్లు, డోర్ హ్యాండిల్స్, డాక్యుమెంట్లపై మిగిలిన వేలిముద్రలను సేకరించి వాటిని డిజిటల్గా క్లోన్ చేస్తున్నట్లు దర్యాప్తుల్లో వెల్లడైంది.
ఈ ఫింగర్ ప్రింట్లను ఉపయోగించి AEPS మైక్రో ATMల ద్వారా నగదు ఉపసంహరణలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో బాధితులకు డబ్బులు పోయిన తర్వాతే విషయం తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో OTP అవసరం ఉండదు. అందుకే ఇది ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన ఫ్రాడ్ మోడల్గా మారుతోంది.
National Payments Corporation of India విడుదల చేసిన వివరాల ప్రకారం 2026 మార్చి 31 నాటికి ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ను ఎనబుల్ చేయలేదని తెలుస్తోంది. అంటే కోట్లాది మంది ఖాతాదారుల బయోమెట్రిక్ సమాచారం దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటే మరింత జాగ్రత్త అవసరం.
ఈ ప్రమాదం నుంచి రక్షణ పొందడానికి ప్రభుత్వం, UIDAI కొన్ని భద్రతా చర్యలు సూచిస్తోంది. అందులో ముఖ్యమైనది బయోమెట్రిక్ లాక్ ఫీచర్. ఒకసారి బయోమెట్రిక్ లాక్ చేస్తే, ఎవ్వరూ మీ ఫింగర్ ప్రింట్ ద్వారా ఆధార్ ఆథెంటికేషన్ చేయలేరు. అవసరమైతే తాత్కాలికంగా అన్లాక్ చేసుకొని మళ్లీ లాక్ చేయొచ్చు.
దీనికోసం mAadhaar App లేదా అధికారిక ఆధార్ సేవలను ఉపయోగించవచ్చు. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్ నెంబర్తో లాగిన్ కావాలి. తర్వాత “Biometric Lock/Unlock” ఆప్షన్లోకి వెళ్లి లాక్ ఎనబుల్ చేయాలి. ఇలా చేస్తే AEPS ఫ్రాడ్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
అదేవిధంగా ఫింగర్ ప్రింట్లు అవసరం లేని చోట ఇవ్వకూడదు. తెలియని వ్యక్తులకు ఆధార్ కాపీలు పంపకూడదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి. ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
