Ketan Agarwal Death: గత ఏడాది ఇండోర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి రఘు వంశీ మేఘాలయలో హత్యకు గురయ్యాడు. అతడి మరణం వెనుక భార్య ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉండడంతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ తరహా ఘటనలు మనదేశంలో తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘటన కూడా అటువంటిదే.
మహారాష్ట్రలోని పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోయాడు. ఇతడిది సహజ మరణమని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం మొదలైంది. కేతన్ అగర్వాల్ చనిపోవడం వెనక పెద్ద కుట్ర ఉందని.. దానికి పాల్పడింది ఒక కీలకమైన వ్యక్తి అని పోలీసులు తేల్చారు. దీంతో కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కేతన్ అగర్వాల్ వయసు 26 సంవత్సరాలు. ఇతడు ఈనెల 18న అత్యంత చారిత్రాత్మకమైన లోహ గడ్ కోట వద్ద దాదాపు 500 అడుగులకు మించిన లోతు ఉన్న ఒక లోయలో పడి చనిపోయాడు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. కేతన్ కు సియా అనే అమ్మాయితో వివాహం కుదిరింది. ఇటీవల వారు సరదాగా గడిపేందుకు లోహగడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగుతుండగా గాలులు వచ్చాయి. దీంతో లోయలో పడి చనిపోయాడని సియా పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఈ సంఘటనను ప్రమాదంగానే భావించారు.
పోలీసులు విచారిస్తున్నప్పుడు సియా సంబంధం లేకుండా సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే సియాకు మరొక వ్యక్తితో రిలేషన్ ఉంది. కేతన్ తో పెళ్లి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే అతడిని చంపడానికి కుట్ర చేసింది. బయటికి వెళ్దామని అతడిని లోహ గడ్ ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడికి సియా ప్రియుడు వచ్చాడు. వారిద్దరూ కలిసి కేతన్ ను లోయలోకి తోసి వేశారు. అతడు చనిపోయిన తర్వాత అసలు నాటకం మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఈ నిజాలు తెలియడంతో సియా, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు.
కేతన అగర్వాల్ స్వస్థలం పూనేలోని గహుంజే ప్రాంతం. ఇక్కడికి స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఒక వ్యాపార కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇతడికి సియాతో ఎంగేజ్మెంట్ జరిగింది. అదే కాదు, వచ్చే నవంబర్ నెల 17న జరిగే పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించడానికి 17 కోట్లతో ఉదయపూర్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ను బుక్ చేశారు. అంతేకాదు బంధువులను తీసుకురావడానికి రెండు హెలికాప్టర్లు కూడా బుక్ చేశారు. అంతేకాదు ఈనెల 19న సియా జన్మదిన సందర్భంగా.. కాబోయే భార్యకు అద్భుతమైన కానుక ఇవ్వడానికి లోహ గడ్ కోటకు వెళ్లారు. అక్కడే కేతన్ తన ప్రాణాలు కోల్పోయాడు.
