Uttar Pradesh: మీరేం మనుషులు రా బాబు.. కానిస్టేబుల్ ప్రాణం పోతుంటే..

గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీకరమైన వేడిగాలులు వీస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సహజంగా ఈ కాలంలో ఆ ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురవాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 6:25 pm

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh: సమాజంలో మానవత్వం రోజురోజుకు మంట కలిసి పోతుంది. మనిషులు అనే వారు పూర్తిగా మాయమైపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ లో గడిపేందుకు చూపిస్తున్న వెచ్చిస్తున్న సమయాన్ని.. తోటి మనిషితో మాట్లాడేందుకు కేటాయించలేకపోతున్నారు. ఆపదలో ఉంటే చెయ్యందించాల్సింది పోయి..ఫోన్ లో వీడియో తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి.. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది.

గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీకరమైన వేడిగాలులు వీస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సహజంగా ఈ కాలంలో ఆ ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురవాలి. కానీ దానికి భిన్నంగా ఉత్తర భారత దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఒకరకంగా అనధికారిక కర్ఫ్యూ వాతావరణం అక్కడ నెలకొంటోంది.. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతమైన కాన్పూర్ నగరంలో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్.. ఎండ వేడికి తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. అతడి వయసు దాదాపు 50 ఏళ్ల పైబడి ఉంటుంది. ఎండలో విధులు నిర్వహించడంతో అతడు నీరసానికి గురై.. కళ్ళు తిరిగి కిందపడిపోయాడు. రక్తపోటు పడిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

వాస్తవానికి ఆ సమయంలో చుట్టూ పోలీసులు ఉన్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సింది పోయి.. తమ చేతిలో ఉన్న ఫోన్లో ఆ దృశ్యాలను వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. కానిస్టేబుల్ వ్యవహార శైలి పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ” మీరేం మనుషులు రా బాబూ.. తోటి ఉద్యోగి ప్రాణాలు పోతుంటే సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారంటూ” నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రతకు నిన్న ఒక్కరోజే దాదాపు ఏడుగురు మృత్యువాత పడ్డారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.