Rakshita Mysuru Case: అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సమయానికి ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగేవి. బంధువుల సందడితో ఆ ఇంటి ప్రాంగణం మొత్తం సందడిగా ఉండేది. అవన్నీ జరిగితే ఈ వార్త రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ దంపతులు ఒకటి తలిస్తే.. ఆ అమ్మాయి మరొకటి కోరుకుంటే.. జరిగింది ఇంకొకటి. చివరికి ఆ కుటుంబం చేసిన పని సభ్య సమాజాన్ని కన్నీరు పెట్టేలా చేస్తోంది.
అది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు.. అక్కడ శివన్న, నాగరత్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రక్షిత అనే అమ్మాయి ఉంది. రక్షిత ఉన్నత చదువులు చదివింది. ఇటీవల శివన్న, నాగరత్న దంపతులు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారు. తెలిసిన యువకుడితో పెళ్లి నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లో వివాహం జరపడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు.
ఇదంతా జరుగుతుండగానే వరుడికి కొన్ని ఫోటోలు వెళ్లాయి. ఒక యువకుడు తన వాట్సాప్ ద్వారా వరుడికి ఫోటోలు పంపించాడు. దీంతో రక్షిత ఆందోళన చెందింది. ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి ప్రధాన కారణం రక్షిత స్నేహితుడు. అతడి పేరు ఉల్లాస్ గౌడ. రక్షితకు, ఇతడికి స్నేహం ఉంది. అతడిని స్నేహితుడిగా భావించి చనువిచ్చింది. అతడు మరో విధంగా ఆలోచించి.. ఫోటోలు.. వీడియో తీసుకున్నాడు. ఎప్పుడైతే రక్షతకు ఎంగేజ్మెంట్ అయ్యిందో.. అప్పటి నుంచి ఉల్లాస్ గౌడ రక్షితను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఫోటోలు.. వీడియోలు బయట పెడతానని తరచూ వేధించేవాడు.
ఉల్లాస్ గౌడ వేధింపులతో రక్షిత అవమాన భారంతో కృంగిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పుకొని బాధపడింది. ఉల్లాస్ గౌడ వేధింపులు మరింత పెరిగిపోవడం.. తనని పెళ్లి చేసుకోపోతే కళ్యాణ మండపంలో గొడవ చేస్తానని చెప్పడంతో.. శివన్న.. నాగరత్న.. రక్షిత ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు ఒక లేఖ కూడా రాశారు. పోలీసులు ఉల్లాస్ గౌడ మీద కేసు నమోదు చేశారు. రక్షిత అతనితో స్నేహంగానే ఉండేదని.. పుల్లాస్ గౌడ వేరే కోణంలో ఆలోచించి ఫోటోలు.. తీసుకున్నాడని.. నాడు రక్షిత ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆమె చూసీచూడకుండా పోవడం వల్లే ఇంత జరిగిందని ఆ రోజే అతడికి కట్టడి విధించి ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు.
