Shwetha Case: ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషించారో.. ఆమె ఎదుగుతుంటే ఎంతగా ఆనందించారో.. ఆమె నడుస్తుంటే.. చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే.. ఎదుగుతుంటే గర్వపడ్డారు. ఉన్నత చదువులు చదువుతుంటే ఆనందపడ్డారు. కానీ.. ఆమె తమ గుండెల మీద తన్నుతుందని.. తమకు తల వంపులు తీసుకొస్తుందని.. చివరికి ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు..
ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. మనుషులనే వారు ఎవరైనా సరే కన్నీటి పర్యంతమయ్యే ఘటన. దీనిని ఎలాంటి దారుణం అనాలో తెలియదు. ఎంతటి ఉన్మాదం.. ఎంతటి పైశాచికం.. ఎంతటి క్రూరం.. ఇలా ఎన్ని పదాలు చెప్పినా సరే తక్కువే. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి.. ఇలాంటి బుద్ధులు ఎందుకు పుడతాయి.. అసలు వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కూడా కలుగుతోంది..
కర్ణాటకలోని బెంగళూరు నగరంలో సాయి గ్రీన్ హోమ్స్ ప్రాంతంలో సోమ సుందర్.. మత్తు లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్వేత.. సుప్రియ కుమార్తెలు.. శ్వేత మొదట్లో బాగానే ఉండేది..ఆ తర్వాత విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. కెన్నెత్ అనే యువకుడితో పెళ్లి కాకముందే సహజీవనం ప్రారంభించింది. ఈ విషయం సోమ సుందర్.. ముత్తు లక్ష్మి కి తెలియడంతో వారు నిలదీశారు. ఇది పద్ధతి కాదు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ శ్వేత తన ధోరణి మార్చుకోలేదు. పైగా మరింత దారుణంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.
ఇక్కడితోనే శ్వేత విచ్చలవిడితనం ఆగిపోలేదు. తన తండ్రి పేరుని వాడుకుని దాదాపు 30 లక్షల వరకు అప్పు చేసింది. అప్పు ఇచ్చినవాళ్లు సోమసుందర్ ఇంటికి రావడం మొదలుపెట్టారు. దీనిపై సోమ సుందర్ శ్వేతను నిలదీశాడు. కొద్దిరోజులుగా అప్పుల వ్యవహారానికి సంబంధించి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శ్వేత తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. తన ప్రియుడుతో కలిసి ఒకరోజు ఇంటికి వచ్చింది. అప్పుడు ముత్తు లక్ష్మీ మాత్రమే ఇంట్లో ఉంది. కెన్నెత్, శ్వేత, ముత్తు లక్ష్మీ మధ్య గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలో కెన్నెత్, శ్వేత కలిసి ముత్తు లక్ష్మి మీద కత్తితో దాడి చేశారు. ఆమె చనిపోయింది. రక్తపు మరకలను శుభ్రం చేసిన తర్వాత.. సోమ సుందర్.. సుప్రియ ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో శ్వేత.. కెన్నెత్ వారి మీద దాడి చేశారు. సుప్రియ చనిపోయింది. సోమ సుందర్ గాయపడి రక్షణ కోసం బయటికి పరుగులు తీశాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్వేత, కెన్నెత్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
