Congress: ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఏకచత్రాధిపత్యం వహించిన పార్టీ అదీ.. ఎంతో మంది ఉద్దండ పిండాలతో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉండేది. కానీ ఒక్క రాష్ట్ర విభజన ఆ పార్టీని ఏపీలో నామరూపాల్లేకుండా చేసింది.. ఇక తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితం చేసింది.. ఇంతకీ కాంగ్రెస్ కు ఏమైంది? ఎందుకిలా దిగజారింది. కొత్తగా పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి ఈ పార్టీకి మళ్లీ జవసత్వాలు నింపగలరా? అన్న అనుమానాలు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ ను వెంటాడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలోనూ లేకుండా మూడోస్థానానికి పడిపోయింది. అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు వెరసి ప్రభుత్వ ఏర్పాటు మాట దేవుడెరుగు ఉన్న సీట్లను ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రజలను ఆకర్షించుకునేందుకు ముప్పుతిప్పలు పడుతోంది. మరోవైపు బీజేపీ దూసుకొస్తూ తెలంగాణలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమిస్తోంది.
* అంతర్గత కుమ్ములాటలు..
తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక పార్టీలో ఎంత ఉత్సాహం కనిపించిందో అంతే కలవరం కూడా మొదలైంది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి మద్దతు, వ్యతిరేఖత రెండూ ఏర్పడ్డాయి. సీనియర్లు ఎంతో మంది ఉండగా రేవంత్ ఎన్నికపై రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఒక సీనియర్ నాయకుడు రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు రాగా అధ్యక్షుడి మంతనాలతో వెనకకు తగ్గినట్లు తెలుస్తున్నది. దీనికి తోడు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ కూడా అంతగా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.
* నాయకత్వ లోపం..
ప్రస్తుతం పార్టీకి నాయకత్వ లోపం కూడా ఒక సమస్యగా మారింది. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు కొందరు టీఆర్ఎస్ లో చేరడంతో ఆయా స్థానాల్లో సెకండ్ కేడర్ లేకుండా పోయింది. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరిని నిలబెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. రేవంత్ మాత్రం సభ్యత్వాన్ని పెంచాలని, బూత్ స్థాయి వరకు పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేసినా నాయకత్వ లోపం కొట్టచ్చినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మరిన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.
* మరింత కలవరం..
ఇటీవల ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ఫలితాలు పార్టీని మరింత కలవర పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లోంచి ఒకటి కోల్పోయే అవకాశం ఉందని, బీజేపీ ఖాతాలోకి మాత్రం మరో రెండు అదనంగా చేరుతాయని సర్వే తెలిపింది. దీంతో కాంగ్రెస్ లో మరింత కలవరం మొదలైంది. వర్గపోరు సమస్యను తీర్చే నాటికే సమయం కాస్తా గడుస్తుందని కార్యకర్తలు, సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ కు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాలని అనుకున్నా పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. తక్షణం ప్రజా సమస్యలపై పోరాడితే కాని పార్టీ కనీసం ఉన్న స్థానాలను కాపాడుకోగలదని తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ నిలదొక్కుకునే ఆశలు ఏటికి ఎదురీదడమే అవుతుంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More