Elon Musk: ఎలాన్ మస్క్ చైనా పర్యటన ఆంతర్యం ఏంటి? భారత్ లో పెట్టుబడులపై సుముఖంగా లేడా?

బ్లమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారతీయ అధికారులతో తన కమ్యూనికేషన్ను నిలిపివేసింది. దేశంలో తన పెట్టుబడి ప్రణాళికలను వాయిదా వేసింది.

Written By: Neelambaram, Updated On : July 5, 2024 11:29 am

Elon Musk

Follow us on

Elon Musk: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ‘టెస్లా’ భారత్ లోకి ప్రవేశించేందుకు మరోసారి బ్రేక్ పడింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత్ లో తన పెట్టుబడి ప్రణాళికను వాయిదా వేసుకున్నారు. అంతకు ముందు ఎలాన్ మస్క్ తన ప్రతిపాదిత భారత పర్యటనను వాయిదా వేసుకొని హఠాత్తుగా చైనాలో కనిపించడం గమనార్హం.

భారత అధికారులతో సంబంధాలు తెగిపోయాయి!
బ్లమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారతీయ అధికారులతో తన కమ్యూనికేషన్ను నిలిపివేసింది. దేశంలో తన పెట్టుబడి ప్రణాళికలను వాయిదా వేసింది. 2024, ఏప్రిల్ లో టెస్లా సీఈఓ భారత పర్యటనను ప్రతిపాదించారని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సి ఉందని, అయితే మస్క్ చివరి క్షణంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారని పేర్కొంది.

భారత్ కు బదులుగా..
మస్క్ అకస్మాత్తుగా చైనాలోని బీజింగ్ లో కనిపించారు. చైనాలో, పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టెస్లా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా ఆయన ఆవిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. చైనా పర్యటన సందర్భంగా టెస్లా భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై మస్క్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ చర్చలు జరిపారు.

ఒక నివేదిక ప్రకారం.. టెస్లా ప్రస్తుత ఆర్థిక సమస్యల కారణంగా, కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో కొత్త పెట్టుబడులను ప్లాన్ చేయడం లేదు. టెస్లా గ్లోబల్ డెలివరీలో వరుసగా రెండో త్రైమాసిక క్షీణతను చూసింది. దీనికి తోడు చైనాలో కూడా ఈ కంపెనీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీలో లే ఆఫ్స్ ప్రకటించారు మస్క్. అంతే కాదు మెక్సికోలో టెస్లా కొత్త ప్లాంట్ నిర్మాణం కూడా ఆలస్యమవుతోంది.

విదేశీ కార్ల తయారీదారులకు భారత్ ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో మస్క్ భారతదేశాన్ని సందర్శించాలని అనుకున్నారని, ఈ సమయంలో భారతదేశంలో భారీ పెట్టుబడుల గురించి చర్చలు కూడా ముమ్మరం అయ్యాయని అధికారులు చెప్పారు. ప్రస్తుత విరామం కొనసాగుతుందని, టెస్లా తిరిగి భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొత్త దిగుమతి పన్ను విధానం ప్రకారం స్వాగతిస్తామని భారత అధికారులు చెప్పారు.