Digital Payments: 12 ఏళ్లు.. 90 రెట్లు.. డిజిటల్‌ లావాదేవీల్లో మనమే తోపు!

గడిచిన 12 ఏళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ముంబైలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యలయంలో డిజిల్‌ చెల్లింపులపై నిర్వహించిన అవగాహన సదస్సులో కీలక విషయాలు వెల్లడించారు.

Written By: Raj Shekar, Updated On : March 6, 2024 12:53 pm

Digital Payments

Follow us on

Digital Payments: డిజిటల్‌ ఇండియా గడిచిన పదేళ్లుగా మోదీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న పదం ఇదీ. భారత్‌లో అన్ని కార్యకలాపాలను డిజిటల్‌ చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2016లో పెద్దనోట్లు రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో డిజిటల్‌ లావదేవీలవైపు ప్రజల దృష్టిని మళ్లించింది. ఇందులో గడిచిన పదేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

భారీగా పెరుగుదల..
గడిచిన 12 ఏళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ముంబైలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యలయంలో డిజిల్‌ చెల్లింపులపై నిర్వహించిన అవగాహన సదస్సులో కీలక విషయాలు వెల్లడించారు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.162 కోట్ల రిటైల్‌ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరగ్గా.. 2023–24 నాటికి ఆ సంఖ్య రూ.14,726 కోట్లకు పెరిగిందని తెలిపారు. అంటే గత 12 ఏళ్లలో డిజిటల్‌ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయని వివరించారు.

ప్రపంచంలో మనమే..
ఇక ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీల్లో 46 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని అని శక్తికాంతదాస్‌ తెలిపారు. యూపీఐ అనేది భారత్‌లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందన్నారు. భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయమైన వృద్ధికి యూపీఐలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. 80 శాతం వాటా యూపీఐలదే అని పేర్కొన్నారు.

యూపీఐ లావాదేవీలు ఇలా..
ఇక యూపీఐ లావాదేవీల విషయానికి వస్తే 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అవి 2023 నాటికి ఏకంగా 11,761 కోట్లకు పెరిగాయని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. ప్రస్తుతం రోజుకు సగటుల 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. చిరు వ్యాపారుల వరకూ యూపీఐ లావాదేవీలు చేరాయని వెల్లడించారు. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న ప్రతీ పల్లెలో డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నట్లు వివరించారు.

భవిష్యత్‌ అంతా డిజిటల్‌దే..
ఇక పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలు భవిష్యత్‌ అంతా వాటిదే అని నిర్ధారిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. ప్రపంచంలో ఒకప్పుడు డిజిటల్‌ లావాదేవీల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుతం భారత్‌ 40 శాతం వాటా సాధించడం గర్వకారణమని తెలిపారు. అక్షరాస్యత పెరుగుదల, ఇంటర్నెట్‌ సదుపాయం, నగదు పెరుగుదల వంటి అంశాలు కూడా డిజిటల్‌ లావాదేవీలకు ఊతమిస్తున్నట్లు తెలిపారు.