Mukesh Ambani: వెన్నంటి ఉన్న వ్యక్తికి 1500 కోట్లు: ముఖేష్ అంబానీనే ఫిదా చేసిన ఆ వ్యక్తి ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా?

ముకేశ్ అంబానీ సాధారణంగా ఏది చేసినా అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏకంగా ₹20 కోట్లు ఖర్చు చేశారు. పెద్ద పెద్ద సినీతారలను పిలిచి ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు.

Written By: K.R, Updated On : April 28, 2023 3:48 pm
Follow us on

Mukesh Ambani: ముఖేష్ అంబానీ.. దేశంలో పరిచయ వ్యాఖ్యం అక్కరలేని పేరు. అతిపెద్ద జనాభా ఉన్న దేశంలో అతిపెద్ద ధనవంతుడు. తాగే కంపా కూల్ డ్రింక్ నుంచి బండిలో పోసుకునే పెట్రోల్ వరకు చేయని వ్యాపారం అంటూ లేదు. ఈ అపర కుబేరుడికి ₹లక్షల కోట్ల ఆస్తులున్నాయి. దేశ విదేశాల్లో ఖరీదైన బంగ్లాలు, వెలకట్టలేని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. అలాంటి ఈ శ్రీమంతుడు ఓ వ్యక్తి గుణానికి ఫిదా అయిపోయాడు. తన వెంటే ఉండి పనిచేస్తున్న మనిషికి సలాం చేశాడు. ఏకంగా ₹1500 కోట్ల విలువైన భవంతి ఇచ్చి అందరినీ అబ్బురపరచాడు. సాధారణంగా శ్రీమంతులు తమ ఇళ్లలో పనిచేసే వారికి ఖరీదైన ఇల్లు, లేదా కారు, బంగారం, వజ్ర వైడుర్యాలు ఇస్తారు. కానీ ఈ తరహా కానుక దేశంలో ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు.

ముకేశ్ అంబానీ సాధారణంగా ఏది చేసినా అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏకంగా ₹20 కోట్లు ఖర్చు చేశారు. పెద్ద పెద్ద సినీతారలను పిలిచి ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు. అలాంటి ముకేశ్ అంబానీ తన కంపెనీలో దశాబ్దాల పాటు పనిచేస్తూ, తనకు నమ్మిన బంటులా ఉన్న మనోజ్ మోదీ అనే వ్యక్తికి 22 అంతస్తుల భవంతిని బహుమతిగా ఇచ్చాడు. దీని విలువ ₹1500 కోట్లు ఉంటుంది. అయితే రిలయన్స్ ఇతర కంపెనీలతో చేసుకున్న వందల కోట్ల ఒప్పందాల్లో మనోజ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. కొన్ని సందర్భాల్లో అంబానీ వల్ల కానిది కూడా ఇతడు చేసి పెట్టాడు. రాముడికి నమ్మకమైన వాడు లక్ష్మణుడే కాబట్టి.. మనోజ్ మోదీని ముఖేష్ అంబానీ తన తమ్ముడిగా భావించాడు. తన కుడి భుజం లాంటి వ్యక్తికి ₹1500 కోట్ల విలువైన భవంతి కానుకగా ఇచ్చాడు.. ఇది కేవలం అతడి మీద తనకున్న ప్రేమ అని మాత్రమే ముకేశ్ అంబానీ చెప్పుకొచ్చాడు. అంతేకానీ దీన్ని ప్రత్యేకంగా చూడొద్దని మీడియాకు తెలిపాడు.

ఇటీవల ముకేశ్ అంబానీ భిన్న వ్యాపారాల్లో రాణిస్తున్నాడు. కేవలం పెట్రో ఉత్పత్తుల తయారీ లో మాత్రమే ఉన్న రిలయన్స్ కంపెనీ ఇతర వ్యాపారంలోకి రావడం వెనుక.. మనోజ్ మోదీ కారణమని రిలయన్స్ వర్గాలు అంటూ ఉంటాయి.. మనోజ్ మోదీకి రిలయన్స్ విస్తరణ మీదే దృష్టి ఉంటుంది. ఇటీవల కంపా కూల్డ్రింక్ ఉత్పత్తిని రిలయన్స్ తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టినపుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కంపా అనేది 90ల కాలంలో భారతదేశాన్ని ఒక ఊపు ఊపిన ఉత్పత్తి. అలాంటి ఉత్పత్తిని రిలయన్స్ చేజిక్కించుకోవడం వెనుక మనోజ్ మోదీ పాత్ర ఉంది. ప్రస్తుతం ఆ ఉత్పత్తిని రిలయన్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ మార్ట్స్, జియో, అజియో… ఇలా ముకేశ్ అంబానీ వేసిన ప్రతి అడుగు వెనక మనోజ్ మోది ఉన్నాడు. అందుకే తన నమ్మిన బంటును ముఖేష్ వదులుకోలేదు. వదులుకోలేడు కూడా. అందుకే ఆ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు తన స్థాయిలో కానుక ఇచ్చాడు. విలువ ₹1500 కోట్లు ఉన్నప్పటికీ.. అది మనోజ్ మోది గుణానికి సరిరాదు.