Homeబిజినెస్E - Commerce : 2030 నాటికి ఆ రంగంలో ప్రపంచంలోనే మూడవ స్థానానికి భారత్

E – Commerce : 2030 నాటికి ఆ రంగంలో ప్రపంచంలోనే మూడవ స్థానానికి భారత్

E – Commerce : టూత్ బ్రష్ నుంచి మొదలుపెడితే కూరగాయల వరకు.. కాళ్ల చెప్పుల నుంచి మొదలుపెడితే తలకు ధరించే క్యాప్ వరకు.. ప్రతిదీ ఈ – కామర్స్ లోనే.. అయితే అమెజాన్.. లేకుంటే ఫ్లిప్ కార్డ్.. ఇక మీ షో, మింత్రా వంటి వాటికైతే లెక్కేలేదు. ఇలా మన వల్ల కొనుగోళ్లు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అమెజాన్ వంటి కంపెనీ బిగ్ బిలియన్ డేస్ పేరుతో రాయితీల మీద రాయితీలు ఇస్తూ కొనుగోళ్ల పండగ జరుపుతోంది. ఫ్లిప్ కార్ట్.. ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. అయితే ఈ కొనుగోళ్లు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మన దేశ ఆర్థిక పరిస్థితి సమూలంగా మారుతుందట.. ఏకంగా 2030 నాటికి ఈ కామర్స్ వ్యాపారంలో భారతదేశంలో వ్యాపారం 325 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఎన్ వెస్ట్ ఇండియా అనే సంస్థ అంచనా వేసింది. 500 మంది మిలియన్ దుకాణదారులు, బలమైన ఇంటర్నెట్ వ్యవస్థ, డిజిటల్ లావాదేవీల మీద పెరిగిన ఆసక్తి, స్మార్ట్ ఫోన్ వినియోగం.. వంటివి పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ- కామర్స్ వృద్ధికి సహకరిస్తున్నాయట.

భారతదేశంలో ఈ – కామర్స్ రంగం వృద్ధిపై ఎన్ వెస్ట్ ఇండియా అనే సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం భారత్ 881 మిలియన్ వినియోగదారులతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ యూజర్లు కలిగి ఉన్న దేశంగా అవతరించింది.. ఇది అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కాలంలో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకునే అవకాశం ఉందని ఎన్వెస్ట్ సంస్థ తెలిపింది. భారత దేశంలో డిజిటల్ ఎకానమీ ఇలానే కొనసాగితే.. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ మార్కెట్ గా భారత్ అవతరించే అవకాశం కనిపిస్తోంది. 2030 నాటికి కొనుగోలుదారులు 530 మిలియన్లకు చేరుతారని ఎన్వెస్ట్ అంచనా వేసింది.

వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ యాక్సెస్ ప్రజల జీవితాలను సమూలంగా మార్చేస్తోంది. 2025 నాటికి దేశ జనాభాలో 85% కుటుంబాలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయని ఎన్ వెస్ట్ సర్వేలో తేలింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బలమైన వృద్ధిరేటుతో ఆన్లైన్ షాపర్ల సంఖ్య పెరుగుతోంది. తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటా లభిస్తోంది. ఇది కొత్త కొత్త వ్యక్తులను ఆన్లైన్ లావాదేవీలకు చేరువ చేసేలా సహకరిస్తున్నది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరుగుతుండడం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఎక్కువవుతుండడం వల్ల ఈ- కామర్స్ వ్యాపారం బలమైన వృద్ధిరేటును నమోదు చేస్తోంది. 2026 నాటికి టైర్ -2, 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా గ్రామీణ ఆధారిత ఈ – కామర్స్ వ్యాపారాన్ని బలోపేతం చేస్తాయని ఎన్వెస్ట్ అంచనా వేసింది. మొత్తం మీద 2030 నాటికి గ్లోబల్ ఈ – కామర్స్ పవర్ హౌస్ గా భారత్ రూపాంతరం చెందుతుందని ఎన్వెస్ట్ స్పష్టం చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version