YCP Leaders Protest Against ABN: నడిపే వాడికి.. నడిపించే వాడికి చాలా తేడా ఉంటుంది. నడిపే వాడికి స్వీయ అనుభవం ఉంటుంది. నడిపించే వాడికి అటువంటి పరిస్థితి ఉండదు. నడిపేవాడు స్వయంగా అన్నీ చూసుకుంటాడు. నడిపించేవాడు కేవలం పర్యవేక్షణకే పరిమితం అవుతాడు. ఇంతకీ ఎందుకు ఈ ప్రస్తావన అంటే.. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై పెద్ద యుద్ధమే చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అంటే ఆ మీడియాకు పడదు. ఈ విషయం ఎవరికి అడిగినా చెబుతారు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ నిషేధిత మీడియా జాబితాలో ఆంధ్రజ్యోతి ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్లు రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడారు అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభియోగం. ప్రతివారం తన వ్యక్తిగత అభిప్రాయం పేరిట సమకాలీన రాజకీయ అంశాలపై కామెంట్స్ చేస్తుంటారు రాధాకృష్ణ. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన పై మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది వైసిపి నేతలు నమ్మేస్తారు అనేది ఆయన వ్యాఖ్య. ఈ క్రమంలో మహిళల విషయంలో జగన్ ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు అనేది ఆర్కే అభిప్రాయం. ఆ కంటెంట్ ను తీసుకొని ఏకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై యుద్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. తమ పార్టీ నేతలను ఏబీఎన్ కార్యాలయం పై పంపించారు. అయితే దీనివల్ల జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం వస్తుందో చెప్పలేం కానీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంతకుముందు వైసిపి హయాంలో జరిగిన మహిళల వ్యవహారాలను ఏకిపారేస్తోంది.
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
* పట్టించుకోకపోతే మేలు..
ఇప్పటివరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి( ABN Andhra Jyothi) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిషేధిత మీడియా జాబితాలో ఉంది. కానీ ఇప్పుడు అదే మీడియాలో వస్తున్న వైసిపి వ్యతిరేక కథనాల కోసమైనా ఆ పార్టీ నేతలు చూడాలి. చూస్తారు కూడా. నిషేధించిన మీడియా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాలి. అదే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే సాక్షి మీడియా ఉంటుందా? అసలు ఉండగలదా? అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పుడు అదే పనిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు, మహిళల పట్ల మాట్లాడిన తీరును కథనాలు చేసి ప్రచురిస్తోంది ఆంధ్రజ్యోతి.
* మహిళలపై వ్యతిరేక వ్యాఖ్యలు.. అమరావతి( Amaravathi capital ) మహిళలను వ్యభిచారులతో పోల్చారు ఓ జర్నలిస్ట్. దానిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది మహిళా రైతుల నుంచి. ఒకరిద్దరు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు కూడా. ఆ కథనం వచ్చింది సాక్షి మీడియాలో. ఆ వ్యాఖ్యలు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఎనలిస్ట్. దానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్. అయితే వీటిపై ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురిస్తోంది. నిండు శాసనసభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వ్యాఖ్యలు, నారా బ్రాహ్మణి పై వ్యాఖ్యలు ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనాలుగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కుటుంబం పై.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులపై.. ఆ ఇంటి మహిళలపై మాట్లాడిన హాట్ కామెంట్స్ ఇప్పుడు కథనాల రూపంలో వస్తున్నాయి. నీ అమ్మ మొగుడు అంటూ కొడాలి నాని తరచూ ఊత పదముల చేసే వ్యాఖ్యలపై కూడా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పటివరకు ఆ మీడియా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం. కానీ అనవసరంగా కెలికి అదే మీడియాతో వ్యతిరేక ప్రచారం చేయించుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇది ముమ్మాటికీ స్వయంకృతాపమే.