Nara Lokesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆలోచించాల్సింది చంద్రబాబు గురించి కాదు.. లోకేష్ కోసం అనే హెచ్చరికలు నేరుగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దానిని ఒక సగర్వంగా చెప్పుకునే వారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చారని పదేపదే ప్రకటించుకునేవారు. కానీ జగన్ పాలన చూసిన ప్రజలు 11 స్థానాలకు దించేశారు. తండ్రి చాటు బిడ్డ, భాష రాదు, రాజకీయం తెలియదు అన్నట్టు ఆరోపణలు చేసిన లోకేష్ ఒక స్థాయికి వెళ్లిపోయారు. ఎవరు అందనంత రీతికి దూసుకెళ్తున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వణుకు మొదలైంది. ఇప్పుడు దృష్టి సారించాల్సింది.. టార్గెట్ చేయాల్సింది చంద్రబాబుపై కాదు. లోకేష్ పై అన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* పరిణితి పెంచుకున్న యువనేత..
లోకేష్ పరిణితి చెందిన నాయకుడిగా ఎప్పుడో మారిపోయారు. ఆయన అదరడం లేదు.. బెదరడం లేదు. మాట్లాడే క్రమంలో తప్పులు ఉచ్చరించడం లేదు. వేలు పెట్టి చూపించే స్థితి నుంచి.. వేలు చూపి ఖబడ్దార్ అన్న రీతికి మారిపోయారు లోకేష్. ఇది ముమ్మాటికి ఆయనలో పరిణితి. రాజకీయం చేస్తున్నారు. పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు. పాలనలో తనదైన ముద్ర చూపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారు. తన విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులు తేగలుగుతున్నారు. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశము. సైలెంట్ గా తన పని తాను చేసుకుని అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటున్నారు.
* చాలా తక్కువ అంచనా
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ పేరు కూడా ఉచ్చరించేది కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ను అస్సలు ప్రస్తావించేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ తనకు సమకాలీకుడు కాదు అనేది జగన్ అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పిల్ల బచ్చాగా చూసేవారు. కానీ ఇప్పుడు అదే లోకేష్ ఒక బ్రహ్మాస్త్రంగా మారిపోయారు తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డికి మించి సమ్మోహన శక్తిగా మారిపోయారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అన్నింటికీ మించి రాజకీయాలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక పాలన దక్షుడిగా, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు చూపే నాయకుడిగా సంపూర్ణత్వం చూపిస్తున్నారు లోకేష్. వైసిపి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. కానీ ఇకనుంచి అలా కాదు. లోకేష్ ను టార్గెట్ చేసుకోవాలని తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

