YSRCP: ఇప్పుడు అందరి చూపు దేశంలోని పార్లమెంట్ వైపే ఉంది. ఎందుకంటే కీలకమైన రెండు బిల్లులపై చర్చ నడుస్తోంది. అయితే ఏపీకి సంబంధించి కూటమితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఏపీ నుంచి లేదు గాని జాతీయస్థాయిలో కాంగ్రెస్తో పాటు వామపక్షాలకు ప్రాతినిధ్యం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు ఈ బిల్లులపై అభ్యంతరం చెప్పాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించాయి. దాదాపు దక్షిణాది రాష్ట్రాల పార్టీలన్నీ ఒకే స్టాండ్ తో ఉన్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రెండు బిల్లులకు మద్దతు తెలుపుతున్నట్లు బిజెపి పెద్దలకు బాహటంగా చెప్పింది. అయితే ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రత్యేక హోదా విషయాన్నీ ప్రస్తావించారు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. ఏదో అడిగాం అంటే అడిగాం అన్నట్టు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించి వదిలేసారు మిథున్ రెడ్డి. అయితే ఈ ప్రత్యేక హోదా ప్రస్తావన వెనుక వైసిపి రాజకీయ వ్యూహం ఉంటుందన్న అనుమానం కూడా ఉంది.
* జగన్ ట్రాప్ లో చంద్రబాబు..
2014లో అధికారంలోకి వచ్చింది టిడిపి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారింది. అప్పటి ఏన్డీఏలో కూడా చేరింది. అదే సమయంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయింది. కానీ ఇప్పటి మాదిరిగా కేంద్రం మాత్రం ఏపీకి ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. అమరావతి రాజధాని లో ఆసక్తి చూపలేదు. అప్పట్లో ప్రత్యేక హోదా డిమాండ్ వస్తే ఇవ్వలేమని కేంద్రం తేల్చింది. దానికి బదులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధికి తమ వంతు సాయం అందజేస్తామని చెప్పింది. కానీ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అపర సంజీవిని అని వైసిపి ప్రచారం చేసింది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఒప్పించ లేకపోయారని అప్పట్లో ప్రచారం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడిన చంద్రబాబు కేంద్రానికి అల్టిమేట్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో ఎన్డీఏ కు గుడ్ బై చెప్పారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి ట్రాప్ అని.. టిడిపి ఎన్ డి ఏ నుంచి గుడ్ బై చెప్పిన మరుక్షణం బిజెపి వైసిపికి సాయం అందిస్తుందని అంచనా వేయలేకపోయారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఓటమి.
* ఈసారి నో ఛాన్స్..
అయితే మరోసారి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఈ అవకాశం ఇస్తారా? ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే ఈసారి ప్రత్యేక హోదా అనేందుకు అవసరమైన పరిస్థితి లేదు. అది సాధ్యం కాదని సామాన్య జనంకు కూడా తెలుసు. ప్రత్యేక హోదా తేవాలని వైసీపీకి ఉంటే ఐదేళ్లు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా? కానీ ఇప్పుడు ఈ రెండు కీలకమైన బిల్లుల చర్చ సమయంలో వైసీపీ ఆ ప్రస్తావన తీసుకొచ్చింది అంటే.. కచ్చితంగా దాని వెనుక రాజకీయ వ్యూహం ఉంటుంది. అయితే ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయాలు చేస్తామంటే మునుపటి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీలు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే దీనిపై ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది.