YSRCP Social Media: ఎద్దు ఈనింది అంటే.. దూడను కట్టేయండి అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహార శైలి. ఆ పార్టీ సోషల్ మీడియా చేసే అతి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లో పెడుతోంది. నవ్వుల పాలు చేస్తోంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజితోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అనంతపురం జిల్లాకు చెందిన బోన్ క్యాన్సర్ సర్వైవర్ స్వప్న అనే వ్యక్తి ఎమోషనల్ గా మాట్లాడారు. చనిపోయే దశలో ఉన్న తనను జగన్ సార్ నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లి.. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందేలా చేసి పునర్జన్మ ఇచ్చారంటూ ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* బాలకృష్ణ అభిమాని జగన్..
జగన్ అని పేరు వినిపిస్తే చాలు.. వెనుక ముందు ఆలోచించుకోరు వైసీపీ కార్యకర్తలు. ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ యువతి మాట్లాడిన వెంటనే… చూశారా? మా జగన్ అన్న మనసు ఎంత గొప్పదో.. మానవత్వంతో కాపాడారు అంటూ భజన స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు పతాక స్థాయికి చేరాయి. కట్ చేస్తే అసలు ట్విస్ట్ చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్ అయ్యాయి. ఆ యువతి చెప్పిన జగన్ సార్ వేరు… వైయస్ జగన్మోహన్ రెడ్డి కానీ కాదు. ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని. ఎన్.బి.కె హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకుడు. ఆయనది అనంతపురం. ఈ విషయాన్ని టిడిపి నేతలు ఆధారాలతో సహా బయటపెట్టారు.
* పార్టీలో కల్లోలం..
అయితే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేపింది. సెల్ఫ్ గోల్ తో వైసిపి అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా.. పార్టీ పరువును బజారున పడేసిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంజిరెడ్డిని.. ఎలా నిర్మించారు అంటూ చాలామంది ప్రశ్నించడం ప్రారంభించారు. మరోవైపు టిడిపి తో పాటు జనసేన సోషల్ మీడియా సైన్యం వైసీపీ క్యాడర్ పై విరుచుకుపడుతోంది. సొంత బాబాయి గొడ్డలి పోటు కేసులోనే కనీసం మాట సాయం చేయని జగన్ రెడ్డి బసవతారకం హాస్పిటల్ లో ఒక పేద అమ్మాయికి రికమండేషన్ లెటర్ ఇచ్చి ప్రాణాలు కాపాడుతారని మీరెలా నమ్మారు రా స్వామి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అయితే వైసీపీ సోషల్ మీడియా అడ్డంగా బుక్ అయింది.
