YSR Congress: ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత గుడ్ బై చెబుతున్నారన్న టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల బెడద తప్పింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు ఉన్నారు. అటువంటివారు సైతం భవిష్యత్తును అంచనా వేసుకొని టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కోలగట్ల పార్టీ మారితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ.
* మంచి నేతగా గుర్తింపు..
రాజకీయంగా నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందారు కోలగట్ల. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 1989లో తొలిసారిగా పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. కానీ ఓటమి ఎదురైంది. 1994, 1999 ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థిగా. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏకంగా అశోక్ గజపతి రాజు పై గెలిచి రికార్డు సృష్టించారు. కానీ మళ్లీ 2009లో ఓడిపోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో గెలిచిన కోలగట్ల ను డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించారు జగన్. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నారు.
* కుమార్తె కోసం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పడకపోవడంతో కోలగట్ల వీరభద్ర స్వామి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. టిడిపిలో చేరితే కోలగట్ల కుమార్తెకు విజయనగరం మేయర్ పదవి ఇచ్చేందుకు హై కమాండ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. పైగా విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీతో అంతంతమాత్రంగా ఉంటుంది ఆయనకు సంబంధం. ఈ కారణాలతోనే ఆయన టిడిపి గూటికి చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.