YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించుకోలేక.. ఉండి నియోజకవర్గానికి చెందిన పివిఎల్ నరసింహారాజు పార్టీకి గుడ్ బై చెప్పారు. రెండు రోజుల కిందట వైసీపీ సమన్వయకర్తగా మంతిన యోగేంద్ర కుమార్ ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అయితే పార్టీకి 10 ఏళ్లుగా సేవలు అందిస్తున్న నరసింహారాజు ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనను తప్పించడం కంటే.. తాను విభేదిస్తున్న యోగేంద్రకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడాన్ని తట్టుకోలేక పోయారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు.
* గత రెండు ఎన్నికల్లో..
గత రెండు ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు నరసింహారాజు. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. గడిచిన ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు పై ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. అటువంటి చోట పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు నరసింహారాజు. ఇప్పుడు బలమైన నేత పేరుతో యోగేంద్రకు అవకాశం ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించిన.. నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పును అవమానంగా భావించారు నరసింహారాజు. అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి తనను అన్ని విధాల వాడుకొని వదిలేసారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
* జారిపోతున్న గ్రాఫ్..
గోదావరి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పడలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. జనసేన బలంతో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. అయినా సరే భారీ మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. రఘురామకృష్ణం రాజు దూకుడును తట్టుకొని నిలబడగలిగారు నరసింహారాజు. అటువంటి నేతను తప్పించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే నరసింహారాజు బాటలో మరికొందరు వైసీపీ నేతలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.







