Supreme Court verdict AP govt in Tirumala: సుప్రీంకోర్టులో( Supreme Court) ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది. తిరుమలలో ప్రసాదం, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. గత కొద్దిరోజులుగా ఈ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించిన వివాదం రగులుతూనే ఉంది. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కూడా చేపట్టింది. చార్జ్ షీట్లో స్పష్టమైన ఆధారాలను సమర్పించింది. నెయ్యి కల్తీ జరిగింది అని స్పష్టం చేసింది. అసలు పాలతో తయారుచేసిన నెయ్యి కాదని.. పామాయిల్ తో కూడిన రసాయన మిశ్రమాలు కలిపారని చెప్పుకొచ్చింది. చర్యలకు కూడా సిఫారసు చేసింది. అయితే అప్పటివరకు దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది పాత్రను తేల్చిన సీట్.. ఆ మేరకు చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు అప్పట్లో టీటీడీ నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునే వారిపై విచారణ చేపట్టేందుకు ఏకసభ్య కమిషన్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.
కేవలం చర్యలకు సిఫార్సులకే..
అయితే సిట్ ( special investigation team) దర్యాప్తు పూర్తయిన క్రమంలో ఏకసభ్య కమిషన్ నియామకాన్ని వ్యతిరేకించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడే రంగంలోకి దిగారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో సానుకూలంగా ఉంటే సుబ్రహ్మణ్యస్వామి.. ఈ ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజే విచారణ చేపట్టింది భారత అత్యున్నత న్యాయస్థానం. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్ రాగా.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సిట్ దర్యాప్తుతో పాటు ఏకసభ్య కమిటీ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ తో పాటు జస్టిస్ సూర్యకాంత్ ఈ పిటిషన్ విచారణ చేపట్టారు. ” రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ఓవర్ లాఫింగ్ కిందకు రాదు. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసింది ” అని తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం చట్ట ప్రకారం సిట్, ఏకసభ్య కమిటీలు తమ విధులను నిర్వహించాలని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిర్మించిన ఏకసభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
సుబ్రహ్మణ్యస్వామి ప్రయోగం..
వైసీపీకి న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు గుర్తుకొచ్చేది మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి( Subramanya Swamy). గతంలో అధికారంలో ఉన్నప్పుడు అదే సుబ్రమణ్య స్వామి ద్వారా అడ్డదిడ్డమైన పిటిషన్లను కోర్టులో దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిటీ నియామకం చేపట్టిందో.. అప్పుడే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం రంగంలోకి దింపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏక సభ్య కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ ఆయనతో పిటిషన్ దాఖలు చేయించింది. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఏక సభ్య కమిటీ, సిబిఐ, టీటీడీని చేర్చారు. ఈరోజు జరిగిన విచారణలో కోర్టు ఏకసభ్య కమిటీని కొనసాగించవచ్చని కీలకతీర్పును వెల్లడించింది.
వైసీపీలో ఆ అనుమానం..
వాస్తవానికి ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో తేలిన అంశాలను చార్జ్ షీట్లో పొందుపరిచింది. స్పష్టంగా చర్యలకు కొన్ని రకాల సూచనలు చేసింది. అయితే ఈ నివేదికను పరిశీలించి ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేయడానికి ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు అయింది. 45 రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకొని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు జరిగిందని వైసిపి అనుమానించింది. అయితే ఈ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం కు షాక్ తప్పలేదు.