YSR Congress Party : ప్రతి స్పందనకు ఒక ప్రతిస్పందన ఉంటుంది. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే.. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెచ్చిపోతే.. టిడిపి, జనసేన బంధం అంతలా బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎంత రెచ్చగొడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంతగా దగ్గరవుతున్నారు. తాజాగా వైసీపీ శ్రేణులతో పాటు జగన్మోహన్ రెడ్డికి అదే చూపించారు ఇద్దరు నేతలు. ఇంకో విషయం ఏమిటంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతున్న ప్రతిసారి.. తమ మధ్య ఉన్న విభేదాలను మరిచిపోతున్నారు టిడిపి, జనసేన శ్రేణులు. 2014 నుంచి నేటి లడ్డూ వివాదం వరకు ఆ రెండు పార్టీలను కలిపిన ఘనత.. ఆ రెండు పార్టీల మధ్య బంధం పెంచిన క్రెడిట్ ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది..
* ఒక్క భేటీతో సంకేతాలు..
టీటీడీ లడ్డూ, నెయ్యి కల్తీ కి సంబంధించిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. కుల రాజకీయాల వరకు తీసుకెళ్లింది. అయితే వైసిపి చేస్తున్న రెచ్చగొట్టే రాజకీయానికి.. ఎట్టి పరిస్థితుల్లో చిక్క కూడదు అనేది టిడిపి తో పాటు జనసైనికుల భావన. ఈ విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వ్యూహ చతురతతో ముందుకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు తమ రెండు పార్టీలు, శ్రేణులు ఇరుక్కోకుండా ఉండేందుకు తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు చంద్రబాబు, పవన్. వారిద్దరూ గంటల తరబడి సమావేశంతో తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. తమ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కులాన్ని బయటకు తెచ్చారని ముందుగానే గ్రహించారు. వైసిపి వ్యూహం బెడిసి కొట్టేలా చేశారు.
* కూటమి విచ్ఛిన్నం అసాధ్యం..
కూటమి విడిపోతేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయమని జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కిందట చెప్పారు. వారు కలిసున్నంతకాలం వారిని పడగొట్టడం అంత ఈజీ కాదని తేల్చేశారు. అటు తరువాతే ఈ నెయ్యి వ్యవహారంలో.. ఒక సామాజిక వర్గం నేతలతో రాజకీయం మొదలయింది. ఒక సామాజిక వర్గంతో ఇంకో సామాజిక వర్గాన్ని తిట్టించడం ప్రారంభమైంది. అయితే ఇలాంటి రాజకీయాలకు గతంలో బాధితులయ్యారు చంద్రబాబు, పవన్. అందుకే ముందుగా మేల్కొన్నారు. గంటల తరబడి సమావేశం అయ్యారు. ఈరోజు బిజెపిని అందులో కలుపు కెళ్ళి మరిన్ని గంటలు సమావేశం కానున్నారు. మీరు రెచ్చగొడితే.. మేం మరింత దగ్గరవుతాం అన్నట్టు సంకేతాలు పంపగలిగారు ఆ ఇద్దరు నేతలు.