YSRCP: అసలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. పుంజుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో బలం పెంచుకోవాల్సింది పోయి.. గొడవలు పడుతున్నారు. బహిరంగంగా కొట్టుకుంటున్నారు. నిన్న ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఏకంగా మహిళా కార్యకర్తలను కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు.. ఆయనకు నివాళులు అర్పించాల్సిన నోటితో తిట్ల దండకం అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.
* రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో మెట్లపై వెళ్తున్న ఒక వ్యక్తి కాలిని తొక్కారని ఒక మహిళ నాయకురాలిని తోసేసాడు ఒక యువనేత. వెంటనే అక్కడున్న వారు వచ్చి ఆమెను సముదాయించారు. ఆ యువనేత తీరును తప్పు పట్టారు. దీంతో ఒక్కొక్కరుగా వచ్చి వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా తలెత్తింది. ఈ క్రమంలో సెల్ ఫోన్ లో ఫోటోలు వీడియోలు తీస్తుండగా కొందరు అడ్డగించే ప్రయత్నం చేశారు. అక్కడకు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పార్టీ హై కమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* పార్టీకి ఆదరణ ఉన్న..
ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆదరణ దక్కుతూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం రెండు సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. అటువంటి జిల్లాలో పార్టీని సమన్వయం చేసే సరైన నేత లేరు. గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు. ఆయన జనసేనలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన సరిగ్గా సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పైగా జిల్లాలో వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సరే పార్టీ పరిస్థితి గట్టెక్కడం లేదు. ఏకంగా రాజశేఖర్ రెడ్డి జయంతి నాడే పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా కొట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది.
