YSRCP Political Situation: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పూర్తిగా నైరాస్యంలో పడిపోయింది. 2014లో ఓడిపోయింది కానీ గౌరవప్రదమైన సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. ఈసారి మాత్రం దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పార్టీలో పూర్తిగా నిస్తేజం అలుముకుంది. కొన్ని వర్గాలు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం అయిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే ఉన్న ఏకైక అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం అన్నది లేకుండా చూడాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం సైతం తాము వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించమని.. పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉంది.
* వైసిపి హయాంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించారు. అప్పట్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన సంయుక్తంగా 20 శాతానికి పైగా గెలుచుకున్నాయి. 80 శాతం వరకు వైసిపి పంచాయితీలను కైవసం చేసుకుంది. 100కు పైగా మున్సిపాలిటీలతోపాటు 12 కార్పొరేషన్లకు సంబంధించి కూడా వైసిపి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే అప్పట్లో వైసిపి దూకుడుగా వ్యవహరించడమే కాదు.. అధికార జులుం ప్రదర్శించిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ 20 శాతానికి పైగా ప్రతిపక్షం గెలుచుకుంటే టర్నింగ్ పాయింట్ అయినట్టే.
* ఎన్నికలకు సిద్ధం..
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రస్తుతం జరుగుతోంది. వెనువెంటనే సామాజిక పింఛన్లు తో పాటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశం. అప్పట్లో వైసీపీ వ్యవహరించినట్టుగా తమ ప్రభుత్వం వ్యవహరించదని చంద్రబాబు చెబుతున్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో కూటమి ఏకపక్షంగా గెలుచుకుంటే వైసీపీకి ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 శాతానికి పైగా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటే ఆ పార్టీకి ప్లస్ పాయింట్. కానీ వైసిపి ఆ పని చేయగలదా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పటికీ ఆ మూడు పార్టీల మధ్య బంధం గట్టిగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్న కసి కనిపిస్తోంది.
