YSRCP income and expenditure controversy: అధికారం ముగిసిన తర్వాత చూడాలి అయ్యవారి చిత్రాలని వెనకటికి ఒక సామెత ఉండేది. ఆ సామెత ఇప్పుడు మార్చి చదువుకోవాలేమో.. ఎందుకంటే వైసిపి అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలలో వైసిపి వ్యవహార శైలి పూర్తి విభిన్నం కదా.. ఆదాయం, ఖర్చుల విషయాలను కూడా అదే స్థాయిని చూపించింది.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక ఆదాయాన్ని సాధించిన రీజినల్ పార్టీగా వైసిపి (140 కోట్లతో) మూడవ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలలో టిడిపి 228.31 కోట్లు, టిఎంసి 219 కోట్లతో కొనసాగుతున్నాయి. అయితే ఖర్చుల పరంగా 340. 20 కోట్లతో వైసిపి తొలి స్థానంలో ఉంది. బీజేడి, టిఎంసి తర్వాత స్థానాలలో కొనసాగుతున్నాయి. దేశంలో 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 36 మాత్రమే ఆడిట్ రిపోర్ట్ సమర్పించాయి. వాటి ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ బయటపెట్టింది.
వైసీపీకి ఆదాయం 140 కోట్లు ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ఖర్చుపెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏకంగా 340.20 కోట్లు ఖర్చు ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆదాయానికి మించి చేసిన ఖర్చును.. ఎలా భర్తీ చేస్తారని.. ఇది ఎలా సాధ్యమవుతుందని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారా.. చేసిన ఖర్చును ఎక్కువ చేసి చూపించారా.. ఖర్చుకు.. వచ్చిన ఆదాయానికి లంకె కుదరకపోవడం ఏంటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు వైసిపికి భారీగా విరాళాలు వచ్చాయి. ఇందులో కొన్ని కాంట్రాక్టు సంస్థలు భారీగా ఆ పార్టీకి విరాళాలు సమర్పించాయని తెలుస్తోంది. వచ్చిన వాటిల్లో కొన్ని విరాళాలు మాత్రమే వైసిపి చూపించిందని.. మిగతా వాటిని దాచిందని టిడిపి నేతలు అంటున్నారు. పైగా ఖర్చు విషయంలో కూడా వైసిపి చెప్పిన సమాచారానికి పొంతనలేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. తమ పార్టీ దేశంలోనే రిచెస్ట్ రీజినల్ పార్టీగా నిలిచిందని వారు చెబుతున్నారు. 228.31 కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ.. ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఉందని.. ఆదాయానికి మించిన ఖర్చు తాము చేయలేదని.. కానీ వైసీపీకి ఇది ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
వైసిపికి ఈ స్థాయిలో ఆదాయం వచ్చి.. ఖర్చు అంతకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా ఆ పార్టీ మీడియా విభాగం పబ్లిష్ చేయలేదని.. దీనినిబట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక వ్యవహారాలకు పాల్పడే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో దోచుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు వివరిస్తున్నారు. బహుశా దేశంలో ఇటువంటి ఆర్థిక వ్యవహారాలకు పాల్పడే రీజినల్ పార్టీలలో వైసిపి ప్రథమ స్థానంలో ఉంటుందని.. ఆ పార్టీ రికార్డును ఏ పార్టీ కూడా చెరిపి వేయలేదని టిడిపి నేతలు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
