Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభం అయ్యింది. జోసెఫ్ రావణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ప్రజల్లోకి భిన్నంగా వెళ్తోంది. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతోంది. సమాజంలో అరాచకాలు సృష్టించే వారి కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని అనుకుంటుందని అభిప్రాయం పెరుగుతోంది. అందుకే వరుస పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ముందుకు వస్తున్నారు. జోసెఫ్ రావణ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. కేవలం భయంతోనే ఇప్పుడు స్పష్టత ఇస్తున్నారు. ఈనెల 1న జోసెఫ్ రావణ్ అరెస్టయ్యారు. అయితే ప్రారంభంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన తప్పేంటి అన్నట్టు మాట్లాడింది. తీరా ఆయన చేసిన తప్పిదాలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో ఆందోళన ప్రారంభం అయింది. అప్పటినుంచి దిద్దుబాటు అన్నట్టు మాట్లాడుతున్నారు.
* నీళ్లు చల్లిన మాజీ నేత..
తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లేశారు విజయసాయిరెడ్డి. జోసెఫ్ రావణ్ అరెస్ట్ ప్రస్తావన తీసుకొచ్చి ఓ సుదీర్ఘ ట్విట్ చేశారు. మతమార్పిడిలను సమర్థించడం, మన సంస్కృతి పై దాడి చేయడం కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిందని.. ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి గుణపాఠం చెప్పాలని విజయసాయిరెడ్డి కోరారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలను తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అలా మాట్లాడారో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన పెరిగింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు రంగంలోకి దిగారు. జోసెఫ్ రావణ్ తో వైసీపీకి సంబంధం లేదని ప్రకటించారు.
* సలహాగా తీసుకుంటే..
విజయసాయిరెడ్డి ట్వీట్ ను ఒక విధంగా సలహాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కీలక సూచన చేసినట్లు అయింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. దానిని మరింత రెట్టింపు చేసింది ఈ వ్యవహారం. అందుకే జోసెఫ్ రావణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే మంచిది అన్నట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. సాధారణంగా ప్రభుత్వ వైఫల్యం ఏమాత్రం కనిపించినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. మరి వైసీపీ చర్యలను నిశితంగా గమనిస్తుంది కూటమి. వైసీపీపై హిందుత్వ వ్యతిరేకం ముద్ర ఉండడంతో ఇప్పుడు జోసెఫ్ రావణ్ వ్యవహారాన్ని వాడుకుంటుంది. టిడిపి కంటే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు రేపుతోంది.
