YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో సంక్లిష్ట పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఓ వాతావరణం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుండడం చర్చకు దారితీస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా టీవీ డిబేట్లతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఆ పార్టీ ఆగ్రనేతలపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వారిని దూరం పెట్టడం వల్ల అలా చెబుతున్నారా? లేకుంటే ఆశించిన స్థాయిలో వారికి చెల్లింపులు చేయడం లేదా? అందుకే వారు ఎదురు తిరిగారా? అనేది తెలియడం లేదు. ప్రధానంగా పాషా, కె ఎస్ ప్రసాద్ ఇప్పుడు వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఒకరికొకరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక సాక్షి ఛానల్ లో జరిగే డిబేట్ కు హాజరు కాబోమని తేల్చి చెబుతున్నారు. అయితే ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరిని పెంచి పోషించిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆ పార్టీ అగ్ర నేతలను వ్యతిరేకిస్తుండడం చూస్తుంటే తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
* చెల్లింపులు నిలిచిపోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో పనిచేసే వారికి ఆశించిన స్థాయిలో చెల్లింపులు జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ఇటువంటి వాటిని సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాండిల్ చేసేవారు. అయితే ఇప్పుడు చెల్లింపులు నిలిపివేయడంతో ఆయన టార్గెట్ అవుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. సాక్షి ఛానల్ డిబేట్ లు అంటే ముందుగా పాషా, కె ఎస్ ప్రసాద్ గుర్తుకు వస్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా డిబేట్లు ఇచ్చే వీరు అవసరం అనుకుంటే వ్యక్తిగత దాడికి దిగుతారు కూడా. అంతలా ఉంటుంది వీరి జోరు. అయితే క్రమేపి ఇటీవల వారి నోరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై పడుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా సాక్షిలో కనిపించే వీరు ఇకనుంచి ఆ ఛానల్ వైపు వెళ్ళమని చెబుతుండడం కూడా విశేషం.
* మావిగన్ పై వ్యతిరేకత..
మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెచ్చిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం- విజయవాడ= గుంటూరును కలుపుతూ మావిగన్ అని పేరు పెట్టాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. ఆ సమయంలో విశ్లేషకుడి రూపంలో కేఎస్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆ తర్వాత సాక్షి ఛానల్ డిబేట్లో పాల్గొని భిన్నంగా స్పందించారు. దీంతో అందరూ పేటీఎం డబ్బులు దక్కకపోవడంతోనే కేఎస్ ప్రసాద్ అలా మాట్లాడారని.. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. అదే సమయంలో పాషా సైతం జగన్ మావిగన్ ప్రతిపాదనను గట్టిగానే తిప్పి కొట్టారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇద్దరూ ఒకరికొకరు ఇంటర్వ్యూలు ఇస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంగా ఏర్పడి పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
* సజ్జల కోవర్ట్ అంటూ ఆరోపణ
ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై ఆ ఇద్దరూ ఇప్పుడు బాహటంగానే ఆరోపణలు చేస్తున్నారు. కోవర్టు అంటూ కొత్త ముద్ర వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చి.. పక్కదారి పట్టించి.. పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారన్న ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. అయితే వీరికి చెల్లింపులు నిలిచిపోయాయని.. అందుకే అలా మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే సాక్షి ఛానల్ కు వెళ్తుంటే.. తమను పెయిడ్ ఆర్టిస్టుల మాదిరిగా చూస్తున్నారని.. అందుకే అటువైపు వెళ్ళమని చెబుతున్నారు. మొత్తానికి ఇద్దరు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులుగా మారిపోవడం చూస్తుంటే మాత్రం ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.