YSR Congress Capital Proposal: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ రాజధానుల స్టాండ్ ఎవరికీ అంత పట్టడం లేదు. అమరావతికి జై కొట్టారు. తర్వాత మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు. ఆ పార్టీ నేతలు తలోదిక్కుగా మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు అయితే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలంటున్నారు. రాయలసీమ నేతలు తమకు అన్యాయం జరిగిపోతుందని చెబుతున్నారు. అమరావతి నుంచి విశాఖకు పాలన రాజధానిగా మార్చితే అప్పుడు మాత్రం ఊరుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే.. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఒకలా.. కోస్తాంధ్ర నేతలు మరోలా.. రాయలసీమ నేతలు ఇంకోలా ప్రకటనలు చేస్తున్నారు.
* ఏకాభిప్రాయంతో అమరావతి..
2014 రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని( Amravati capital ) రాజధానిగా ఎంపిక చేశారు. అందరూ ఏకాభిప్రాయంతోనే దానిని ప్రకటించారు. అయితే అమరావతి స్టాండ్ పైనే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయి. కానీ రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గమ్యం లేని ప్రయాణం చేస్తోంది. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ తన ప్రయాణం సాగించింది. కానీ అనుకున్న గమ్యానికి చేరలేకపోయింది. చివరిగా విశాఖ ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ తమ రాజధాని రూట్ ను విశాఖ రుషికొండ గా నిర్ధారించింది. కానీ ఐదేళ్ల కాలంలో ఇది నా రాజధాని స్టాండ్ అని చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి.
* అదే నిలకడ లేని తనం..
ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం ( central government)స్పష్టంగా తెలియజెప్పింది చట్టబద్ధత కల్పించడం ద్వారా. కానీ వైసీపీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ కొత్త రాజధాని ప్రయాణం మొదలుపెట్టింది. అయితే తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. చంద్రబాబుకు మావిగన్ నచ్చకపోతే అయోధ్య అని పేరు పెట్టుకోండి అంటూ సూచించారు. ఏపీ అభివృద్ధికి ఒక్క మావిగన్ మాత్రమే బాటలు వేస్తుంది అంటూ తమ నిలకడ లేని భావాన్ని బయట పెట్టుకుంది. ఎక్కడ అమరావతి.. ఎక్కడ మూడు రాజధానులు.. ఎక్కడ మావిగన్.. ఇప్పుడు కొత్తగా అయోధ్య.. అంటూ సరిహద్దులు దాటించేశారు మాజీమంత్రి పేర్ని నాని. ఇలాంటి నిలకడ లేని తనంతో ప్రయాణం సాగిస్తున్న వైసీపీని ప్రజలు మరోసారి ఆదరిస్తారా? అన్నది అనుమానమే.