YSR Congress Kapu Leaders: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఇప్పుడంతా అంబటి రాంబాబు అన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటివరకు చాలామంది అరెస్టయ్యారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. కానీ ఎవరికీ ఇవ్వని హైప్ అంబటి రాంబాబుకు ఇస్తుండడం పై ఇతర వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు దూకుడు కలిగిన నేతలంతా అరెస్టులకు గురయ్యారు. కానీ వారి విషయంలో జగన్ వైఖరి వేరేలా ఉంది. అంబటి రాంబాబు విషయంలో మాత్రం కొంచెం అతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల్లో పాతుకుపోతోంది. అంబటి రాంబాబును కాపు టైగర్ గా చిత్రీకరించడం పై రకరకాల చర్చ నడుస్తోంది. అరెస్ట్ అయిన ఇతర నేతల్లో లేనిది.. అంబటి రాంబాబు లో ఉన్నది ఏంటి అనే ప్రధాన చర్చ వైసీపీలో జరుగుతోంది. అది అంతిమంగా పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంది.
* పాపం నందిగాం సురేష్..
కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన విషయంలో న్యాయ సహాయం చేసేందుకు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రచారం నడిచింది. తాను జైలుకు వెళ్లాక తన కుటుంబ సభ్యులతో మాట్లాడే వారు లేకుండా పోయారని పలు ఇంటర్వ్యూల్లో నందిగాం సురేష్ చెప్పుకొచ్చారు. కనీసం న్యాయపరమైన సహాయం చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో నందిగాం సురేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రచారం నడిచింది. అంతలా ఆయన ఆవేదనకు గురైనట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ మాత్రం జరిగింది.
* వారి విషయంలో భిన్నం..
ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ సుదీర్ఘకాలం జైల్లో ఉండి పోవాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ దక్కేసరికి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన అరెస్టు సమయంలో సైతం సాక్షి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన సైతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆయన విషయంలో సైతం ఆశించిన స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అండగా నిలవలేదన్న ప్రచారం ఉండేది. అందుకే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవకపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
* అంబటికి ప్రాధాన్యంపై..
అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి హైప్ క్రియేట్ చేస్తున్నారు అన్నది వైసీపీలో ఒక వాదన. అదే సమయంలో కాపు నేతల మధ్య కూడా విభేదాలకు అవకాశం కలుగుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది కాపు నేతలు ఉన్నారు. వారందర్నీ కాదని అంబటి రాంబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా రచ్చకు కారణం అవుతోంది. ఈ విషయంలో వైసీపీ కాపు నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.