YS Jagan Mohan Reddy: వచ్చే ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో గెలవాల్సిందే. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. పైగా ఒకరు అభ్యర్థి అయితే మరో బలమైన నేతను ఆ నియోజకవర్గంలో రెడీ చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా గెలిస్తే మరొకరికి ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్ పదవి ఇస్తామని చెబుతున్నారు. తాజాగా రేపల్లె నియోజకవర్గం లో అదే జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జిగా మోహన్ అనే నేత ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మోపిదేవి శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. మోహన్ ను గెలిపించే బాధ్యత శ్రీనివాసరావుకు అప్పగించారు. రేపల్లెలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. అందుకే అక్కడ ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి.. మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి.
* ప్రయోగాలన్నీ విఫలం..
మొన్నటి ఎన్నికల్లో చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ప్రభుత్వం కంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అధికంగా ఉందని భావించి ఈ ప్రయోగం చేశారు. అయితే ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యే అభ్యర్థులపై కాదు అని.. అదంతా ప్రభుత్వం పైనేనని ఆ ఫలితాల్లో తేలింది. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యం ఉండేది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఒకరు ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకొకరికి అప్పగించారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే టికెట్ను ఇద్దరు ముగ్గురు ఆశించేవారు. అందులో ఒకరికి దక్కితే మిగతా ఇద్దరూ వ్యతిరేకించారు. అలా చాలా జిల్లాల్లో…చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీపడే క్రమంలో ఓటమి చవిచూసిన వారు ఉన్నారు.
* పక్కనే మరో నేత రెడీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒకే ఫార్ములాతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్న నేతల్లో బలమైన వారికి అక్కడ సీటు కేటాయిస్తారు. ఒకవేళ ఇతర పార్టీల్లో చేరిన వారు బలమైన నేతలు అయితే వారికి ఛాన్స్ ఇస్తారు. అయితే మరో నేతను అక్కడ సిద్ధం చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. మరొకరు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ తో పాటు నామినేటెడ్ పదవి హామీ ఇస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ పదవి కోసమైనా ఆయన కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా. అయితే గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నవారే ఓడించారు. వారు తాము ఎమ్మెల్సీలు గా ఉండడం కంటే.. అన్ని రకాల అధికారాలు ఉండే ఎమ్మెల్యే పదవిని ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విభేదించి ఓడించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గానే చెబుతుండడం గమనార్హం. అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
